
హైదరాబాద్: గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2017 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీతో పాటు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి కూడా ఎంపికయ్యాడు.
ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకోవడం విరాట్ కోహ్లీ ఇది రెండోసారి. అంతేకాదు ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్, టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ జట్లకు కూడా కెప్టెన్గా విరాట్ కోహ్లీనే ఎంచుకుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
2009లో ధోనీ మాత్రమే ఈ రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా ముగ్గురు కెప్టెన్లు మాత్రమే ఒకే ఏడాదిలో టెస్టు, వన్డే కెప్టెన్గా ఎంపికయ్యారు. 2004, 2007 ఏడాదిల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించగా.... ఆ తర్వాత ధోనీ, కోహ్లీలు మాత్రమే ఈ ఘనత సాధించారు.
అంతేకాదు 2017 సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. 2004లో రాహుల్ ద్రవిడ్, 2010లో సచిన్ టెండూల్కర్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.