బెంగళూరు: భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐసిసి ప్రపంచ టీ20 టీంకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆదివారం ముగిసిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కోహ్లీ గెలుచుకున్న విషయం తెలిసిందే.
సెమీ ఫైనల్లో వెస్టిండీస్ జట్టు చేతిలో టీమిండియా పాలైంది. కాగా, కోహ్లీ ఈ టోర్నీలో 273 పరుగులు చేయడంతోపాటు ఒక వికెట్ తీసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును ఓడించిన వెస్టిండీస్ జట్టు టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. దీంతో రెండోసారి ఈ ట్రోఫీని గెలుచుకున్న మొదటి జట్టుగా విండీస్ రికార్డు సృష్టించింది.
'12వ ఆటగాడితో కూడిన ఈ టీంను మాజీ దిగ్గజ ఆటగాళ్లు రూపొందించారు. తాజా ప్రదర్శన ఆధారంగా ఈ జట్టును ఎంపిక చేశాం' అని ఐసిసి సోమవారం పేర్కొంది. ఈ జట్టులో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు, ఇండియాకు చెందిన ఇద్దరు, వెస్టిండీస్కు చెందిన ఇద్దరు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి ఒక్కో ఆటగాడ్ని ఎంపిక చేసినట్లు తెలిపింది.

అలాగే, మహిళా జట్టు కోసం న్యూజిలాండ్ జట్టు నుంచి నలుగురు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల నుంచి ఇద్దరేసి ఆటగాళ్లను, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి ఒక్కో ప్లేయర్ను తీసుకున్నట్లు చెప్పింది.
కాగా, క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీని పురుషుల జట్టుకు కెప్టెన్గా ఎన్నుకున్నారని, అలాగే స్టఫానీ టేలర్ను మహిళా జట్టకు సారథిగా ఎంపిక చేశారు. కోహ్లీతో పాటు అశీష్ నెహ్రా కూడా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు.