కోల్కతా: భారత స్టార్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు పాకిస్థాన్లో చాలామంది ఉన్నారని ఆ దేశ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చెప్పారు. ఒకవేళ వారిద్దరూ పాకిస్థాన్కు వస్తే వాళ్లను చూసేందుకు అభిమానులు పోటెత్తుతారని, రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతుందని అన్నారు.
ఇరు దేశాల్లో క్రికెట్ చాలా పాపులర్ అని, ఆటగాళ్లపై ఎక్కువ ప్రేమానురాగాలు ఉంటాయన్నాడు. పాక్లో కోహ్లీ, ధోనీకి సూపర్ స్టార్ స్టేటస్ ఉందని తెలిపాడు. పాక్ ఫ్యాన్స్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను ఎన్నో ఏళ్లు ఆరాధించారని తెలిపాడు. తమపై ఆడేప్పుడు అతణ్ణి చూసి భయపడ్డారని చెప్పాడు.

ఇండియాలో కూడా అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, మియాందాద్లను ఆరాధించిన వాళ్లున్నారని తెలిపాడు. ఇక పాక్లో కంటే భారతలోనే తమకు ఎక్కువ ప్రేమ దక్కుతుందని వ్యాఖ్యానించి విమర్శలపాలైన ప్రస్తుత పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫిద్రీ ఇప్పుడు ఇతర విషయాల కంటే ఆటపైనే దృష్టి కేంద్రీకరించాలని అక్రమ్ సూచించాడు.
అఫ్రిదీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మీడియా, పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, కోల్కతాలో శనివారం జరగనున్న టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచులో ఓడిపోయిన భారత్.. పాకిస్థాన్ పై తప్పక గెలవాల్సి ఉంది.