
హైదరాబాద్: బ్యాటింగ్ శైలి, మైదానంలో ఫీల్డింగ్, సారథ్యం వహించడంలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలది ప్రత్యేకమైన శైలి. ఒకరు కెప్టెన్ కూల్గా పేరు తెచ్చుకుంటే మరొకరు దూకుడుకు చిరునామాగా మారారు. ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా... కోహ్లీ ఇప్పటికి మైదానంలో ధోని సూచలను పాటించడాన్ని మనం చూస్తునే ఉన్నాం.
తాజాగా ధోని, కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే వెబ్ సిరిస్ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్యూలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పంచుకున్నాడు. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేసే విధానాన్ని ధోని నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా నేర్చుకోవాల్సి ఉందని పాండ్యా ఈ సందర్భంగా తెలిపాడు.
'ధోని, కోహ్లీ కెరీర్లో ఎదిగిన విధానం అందరీ ఆదర్శప్రాయం. వారిలానే నేనూ ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నా. అందుకే క్రమశిక్షణతో ఆట ఆడుతున్నా. కొన్ని సందర్భాల్లో వారు అలా ఎలా ఎదగగలిగారో అని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటా. కోహ్లీకి ఆటపట్ల అంకితభావం చాలా ఎక్కువ. అందులో భాగంగానే అతను దూకుడుగా ఉంటాడు' అని పాండ్యా అన్నాడు.
'కానీ.. అదంతా మైదానం వరకే. కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్ సెట్ చేసే విధానంలో ఇద్దరిదీ భిన్నమైన శైలి. ధోని కెప్టెన్సీ ప్రమాణాలను కోహ్లీ అందుకోవాలంటే ఇంకా కొంచెం కష్టపడాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ సెట్ చేసే విధానంలో' అని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్ నుంచి పాండ్యా విశ్రాంతి తీసుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.