
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి విజయం సాధించింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఈ జట్టు గెలుపు రుచి చూసింది. యూపీ వారియర్జ్ను మట్టికరిపించింది. ఈ క్రమంలో ఈ విజయం వెనుక ఉన్న అసలు కారణం బయటకు వచ్చింది. ఆర్సీబీ అమ్మాయిల విజయం వెనుక విరాట్ కోహ్లీ మాటలు ఉన్నాయట. ఆర్సీబీ జట్టులో కీలక సభ్యురాలైన హెదర్ నైట్ కూడా ఈ విషయం చెప్పింది. మ్యాచ్ ముందు కోహ్లీ తమ టీంతో మాట్లాడాడని, చాలా మోటివేట్ చేశాడని ఆమె వెల్లడించింది.
డబ్ల్యూపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ జట్టు చాలా బలంగా కనిపిస్తోందని, కప్పు కొట్టినా కొట్టొచ్చని చాలా మంది అంచనాలు వేశారు. కానీ లీగ్ మొదలైన తర్వాత ఆర్సీబీ అమ్మాయిలు తేలిపోయారు. వరుస పెట్టి ఓటములు చవిచూశారు. అవతలి జట్టు బలహీనంగా ఉన్నా వీళ్లు మాత్రం సత్తా చాటలేకపోయారు. ఈ క్రమంలోనే వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. ఇది చూసిన ఫ్యాన్స్ గుండె బద్దలైంది. ఏదో సాధిస్తారని అనుకుంటే అమ్మాయిలు ఇలా తేలిపోతున్నారేంటని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో యూపీ వారియర్జ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చాలా పుంజుకుంది. చాలా వరకు తమ జట్టు చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకుంది. ఈ క్రమంలోనే కోహ్లీ తమను చాలా మోటివేట్ చేశాడని ఆర్సీబీ అమ్మాయిలు చెప్తున్నారు. ఫ్యాన్స్ కూడా చాలా సంతోషిస్తున్నారు. కోహ్లీ చలవ వల్లే అమ్మాయిలు గెలిచారని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ కూడా కష్టాలను మైలు రాళ్లుగా మార్చుకోవాలని చెప్పడానికి ఇంత కన్నా బెటర్ ఎవరున్నారు? అంటూ కోహ్లీ ఈ టీంతో మాట్లాడుతున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.