
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో కోహ్లీ డబుల్ సెంచరీ చేయడం చాలా సింపుల్ అని అందరూ అనుకున్నారు. కానీ బ్యాటింగ్ వేగం పెంచే క్రమంలో అక్షర్ పటేల్ అవుటయ్యాడు. అసలే వెన్ను నొప్పితో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరం అవడంతో ఆ తర్వాత సరైన బ్యాటర్లు లేకుండా పోయారు.
అక్షర్ అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరం అవడంతో రాలేదు. ఈ క్రమంలో అశ్విన్ వచ్చాడు. అతను కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ డబుల్ సెంచరీ చేయడం కష్టంగా మారింది. అదే క్రమంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఉమేష్ యాదవ్ను డబుల్ తీయడానికి సిద్దంగా ఉండాలని కోహ్లీ హెచ్చరించాడు. ఆ తర్వాత ఇద్దరూ డబుల్కు ప్రయత్నించినా డైరెక్ట్ త్రో పడటంతో ఉమేష్ యాదవ్ కూడా అవుటయ్యాడు.
అనంతరం మహమ్మద్ షమీ బ్యాటింగ్కు వచ్చాడు. ఈ క్రమంలో మరో బ్యాటర్ లేకపోవడంతో కోహ్లీకి సహకారం లేకుండా పోయింది. దీంతో కోహ్లీనే భారీ షాట్లు ఆడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఒకసారి అతను భారీ షాట్ ఆడబోగా బౌండరీ వద్ద హాండ్స్కోంబ్ జారవిడిచాడు. ఆ తర్వాత మర్ఫీ బౌలింగ్లో మరోసారి భారీ షాట్ ఆడేందుకు కోహ్లీ ట్రై చేశాడు. అయితే ఈసారి లబుషేన్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టేశాడు. దీంతో 186 పరుగుల స్కోరు వద్ద కోహ్లీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.