
హైదరాబాద్: అటు అండర్-19 వరల్డ్ కప్కు కుర్రాళ్లతో కూడిన యువ జట్టు, ఇటు కోహ్లీ నేతృత్వంలోని సీనియర్ జట్టు... ఇరు జట్లూ బుధవారం తమ తమ సిరిస్ల కోసం విదేశీ పర్యటనకు బయల్దేరాయి. జనవరి 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా అండర్-19 వరల్డ్ కప్ జరగనుంది.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న పృథ్వీ షాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
అండర్-19 వరల్డ్ కప్లో పోటీపడే భారత జట్టు కెప్టెన్ పృథ్వీ షా ప్రతిభ గురించి తాను చాలా విన్నానని కోహ్లీ అన్నాడు. 'పృథ్వీ షా ఆసక్తిని కలిగిస్తున్నాడు. అతడి గురించి నేను చాలా విన్నా. అద్భుత నైపుణ్యం ఉన్న క్రికెటర్. అతని ఆట కోసం నేనూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. రవి భాయ్ (రవిశాస్త్రి) కూడా అతడి గురించి నాతో చాలా చెప్పాడు' అని కోహ్లీ అన్నాడు.
'ఫస్ట్క్లాస్ క్రికెట్లో పృథ్వీ గొప్పగా రాణించాడు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా వస్తుంటారు. ఇప్పుడు కెప్టెన్గా కూడా పని చేయబోతున్నాడు. అతడిలో ప్రత్యేక సామర్థ్యం ఉంది' అని కోహ్లీ అతడిని ప్రశంసల వర్షంతో ముంచెత్తాడు. కాగా, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరిక మేరకు విమానం ఎక్కే ముందు కోహ్లీ అండర్-19 కుర్రాళ్లతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా యువ కుర్రాళ్లకు కోహ్లీ కొన్ని కీలక సూచనలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. వరల్డ్ కప్ (జనవరి 13 నుంచి) కోసం న్యూజిలాండ్ వెళ్తున్న యువ జట్టు... సీనియర్ జట్టుతో పాటు ఒకే విమానంలో దుబాయ్ వరకు ప్రయాణించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.