ఐపీఎల్-2024 సెకండ్ హాఫ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ గేర్లో దూసుకెళ్తోంది. డబుల్ హాట్రిక్ ఓటముల తర్వాత ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6), రాహుల్ తెవాతియా (35; 21 బంతుల్లో, 5x4, 2x6), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో, 3x4, 2x6) పరుగులు సాధించారు. యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పవర్ప్లేలో (92/1)నే ఆర్సీబీ విజయం ఖరారైంది. కానీ ఆ తర్వాత 25 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ మోస్తారు టార్గెట్ కావడంతో బెంగళూరు సునాయాసంగా విజయం తీరాలకు చేరింది. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2x4, 4x6) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు.
అయితే ఈ క్రమంలో కింగ్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో విజయం సాధించిన మ్యాచ్ల్లో 4000 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విజయాల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి 4039 పరుగులతో టాప్లో ఉన్నాడు. విరాట్ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (3945), రోహిత్ శర్మ (3918), డేవిడ్ వార్నర్ (3710), సురేశ్ రైనా (3559) ఉన్నారు. అంతేగాక కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో 12500 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత బ్యాటర్గా ఘనత అందుకున్నాడు.