ముంబై: క్రికెట్ దిగ్గజం, తాను ఎంతగానో ఆరాధించే సచిన్ టెండూల్కర్పై వస్తున్న జీవిత చరిత్ర ఆధారిత సినిమా(బయోపిక్) ఎప్పుడు విడుదల చేస్తారా.. అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి తెలిపాడు. తన అభిమానులతో నిరంతరం అనుసంధానం అయ్యేందుకు రూపొందించిన 'విరాట్ ఫ్యాన్ బాక్స్' ఆవిష్కరణ కార్యక్రమంలో కోహ్లి మాట్లాడాడు.
'చిన్నప్పట్నుంచి నేను ఆరాధించేదెవరో అందరికీ తెలుసు. ఎవర్ని చూసి క్రికెట్లోకి అడుగుపెట్టానో.. ఆయనెప్పుడూ నాకు ఆరాధనీయుడే. సచిన్ బయోపిక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆ సినిమా చాలా ఆసక్తిగా ఉంటుంది' అని కోహ్లి అన్నాడు.

ఇదే సమయంలో త్వరలోనే విడుదలయ్యే టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్, ప్రస్తుత కెప్టెన్ ఎంఎస్ ధోనీ చిత్రాలు వీక్షించేందుకు కూడా ఆసక్తితో ఉన్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా క్రికెట్, వ్యక్తిగత జీవితం, రియో ఒలింపిక్స్కు భారత అంబాసిడర్గా సల్మాన్ నియామకం గురించి మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు.
'నాకు తెలియని అంశంపై నేను స్పందించడం సరికాదు. ఈ అంశంపై వ్యాఖ్యానించను' అన్నాడు. వ్యక్తిగత జీవితం, బాలీవుడ్ తార అనుష్క శర్మతో అనుబంధం గురించి మహిళా విలేకరి ప్రశ్నించగా కోహ్లి తెలివిగా తప్పించుకున్నాడు. 'అది ఎవరూ తెలుసుకోకూడదు. మీ జీవితం ఎలా ఉంది? ఎలా కొనసాగుతుంది? వీటిపై నేనేమీ చెప్పకూడదు' అని పేర్కొన్నాడు.
అభిమానులు తనతో అనుసంధానం అయ్యేందుకు 'విరాట్ ఫ్యాన్ బాక్స్' మంచి అవకాశం అని, అందులో ఉండే సమాచారం చాలా ప్రత్యేకమని, ఇతర సోషల్మీడియాలో దొరకదని వెల్లడించాడు. కాగా, ప్రస్తుత ఐపిఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథిగా కొనసాగుతన్న కోహ్లీ.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 367 అత్యధిక పరుగులతో కోహ్లీ కొనసాగుతున్నాడు.