
హైదరాబాద్: భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021కు ముందే భారత జట్టు టీ20 పగ్గాలు వదిలేస్తున్నా అని కోహ్లీ చెప్పేశాడు. మెగా టోర్నీలో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్.. కెప్టెన్గా కోహ్లీకి చివరిది. ఇక నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది.
కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అందించింది. ఇకపై టీ20లకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. ఇక ఇప్పుడు టెస్టు జట్టు కెప్టెన్సీపై చర్చలు మొదలయ్యాయి.
భారత టీ20 జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికవడంతో టెస్టు సారథ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ రెగ్యులర్ సారథి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్గా తప్పుకొంటే.. ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలనే విషయంపై బీసీసీఐకి ఓ స్పష్టత లేదని తెలుస్తోంది. టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్, భారత్ జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. ఈ పర్యటనలోని టీ20 సిరీస్కు కోహ్లీకి బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే మొదటి టెస్టుకూ విరాట్ అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. దీంతో ఈ టెస్టుకు ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరి మనస్సులో ఉంది. ఇందులో అజింక్య రహానే ముందు వరసలో ఉన్నా.. రోహిత్ కూడా రేసులో ఉన్నాడు.
ఇప్పటికే టెస్టు జట్టులో రెగ్యులర్గా ఆటగాడిగా కొనసాగుతున్న అజింక్య రహానే.. విరాట్ కోహ్లీకి డిప్యూటీగా సేవలందిస్తున్నాడు. కానీ ఇటీవలి కాలంలో బ్యాటింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అంతకుముందు ఆసీస్ పర్యటనలో మాత్రం ఒక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన జింక్స్.. మిగతా అన్ని మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
ఒకవేళ అతడు జట్టులో చోటు లేకపోతే.. జట్టు పరిస్థితి వేరేలా ఉంటుంది. మరోవైపు టీ20 జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లతో పాటు కొత్త కోచ్ ద్రవిడ్ కూడా రోహిత్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడే టెస్టు కెప్టెన్సీ విషయంలో మార్పులు ఉండకపోవచ్చు. మొదటి టెస్టుకు ఎవరు కెప్టెన్గా ఉంటారో చూడాలి.