
హైదరాబాద్: గత ఏడాది టెస్టు హోదా దక్కించుకున్న దేశాలు అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్. ఈ రెండు దేశాలు ఈ ఏడాదిలో తొలి టెస్టు ఆడబోతున్నాయి. అఫ్గానిస్థాన్.. భారత్తో, ఐర్లాండ్.. పాకిస్థాన్తో టెస్టు మ్యాచ్ నేపథ్యంలో ఆరంగ్రేటం చేయనున్నాయి. ఇందుకు ఎప్పటినుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్లో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఏకైక టెస్టు జరగనుంది. బెంగళూరు వేదికగా ఈ టెస్టు జరగనుంది.
ఐతే.. ఈ చరిత్రాత్మక టెస్టుకి భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు సమాచారం. ఎందుకంటే అదే నెలలో కోహ్లీ సేన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కోహ్లీని అఫ్గానిస్థాన్తో జరిగే ఏకైక టెస్టు నుంచి విశ్రాంతి కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో జరగనున్న ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ భారత జట్టు కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం భారత్ నెల ముందే ఇంగ్లాండ్కు వెళ్లనుంది.
బెంగుళూరు వేదికగా జరగనున్న అఫ్ఘనిస్థాన్, భారత్ల టెస్టు 2018 జూన్ 14 నుంచి 18 వరకు జరగనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు జనవరి నెలలోనే తమ ఆమోదాన్ని వెలిబుచ్చాయి. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం జింబాబ్వే జట్టుకు ఎంతమాత్రం కలిసిరానుందో చూడాలి.