ముంబై: మ్యాచ్ మధ్యలో తన ప్రేయసి అనుష్క శర్మను కలవడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వదిలేసింది. అది పెద్ద తప్పేమీ కాదనే ఉద్దేశంతో చర్యలు తీసుకోకుండా కోహ్లీని బిసిసిఐ వదిలేసింది.
ఆదివారం నాడు కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో మాట్లాడటంపై ఐపీఎల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుష్క శర్మతో మాట్లాడటంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని కోహ్లీని హెచ్చరించాడు.

ఆదివారం ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ను అనుష్క డ్రెస్సింగ్ రూం పక్కనున్న వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రూంకి వచ్చిన కోహ్లీ.. అనుష్క శర్మను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఇద్దరు సుమారు ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ ఆటగాడు యువరాజ్ సింగ్ వారి పక్కనే ఉన్నాడు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మ్యాచ్ సమయంలో తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో తప్ప మరెవరితోను క్రికెటర్లు మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు అనుష్క శర్మను పిలిపించుకొని, మాట్లాడి.. ప్రియురాలి కోసం నిబంధలను అతిక్రమించాడు.