
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని సాధించాడు. ఈ మ్యాచ్లో 110 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో కోహ్లీ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలసిందే. తొలిరోజైన శనివారం టీ విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ 62వ ఓవర్లో సింగిల్ తీసి సెంచరీ సాధించాడు.
టెస్టుల్లో కోహ్లీకి ఇది 20వ సెంచరీ. అంతేకాదు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 20 సెంచరీలు నమోదు చేసిన జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు తన సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లాలో కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ. దీంతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ 16 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
అయితే 16వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటాగాడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం. 363 ఇన్నింగ్స్ల్లో ఆమ్లా 16 వేల పరుగులు సాధించగా.. కోహ్లీ 350 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను సాధించాడు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల బంతులను ఎదుర్కొన్న ఘనతను కూడా కోహ్లీ దక్కించుకున్నాడు.
మూడు ఫార్మాట్లూ కలిపి ఈ ఏడాది 20కిపైగా హాఫ్ సెంచరీలను కోహ్లీ నమోదు చేశాడు. అంతకముందు రాహుల్ ద్రవిడ్ 19 హాఫ్ సెంచరీలు సాధించగా ఇప్పుడు కోహ్లీ దానిని బద్దలు కొట్టాడు. ఇదే టెస్టులో కోహ్లీ మరో ఘనత కూడా సాధించాడు. టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఢిల్లీ టెస్టులో తొలిరోజు 25 పరుగులు పూర్తి చేయగానే కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీకి ఇది 63వ టెస్టు. ఇన్నింగ్స్లో లక్మల్ వేసిన 30.3వ బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
105 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక, మొత్తంగా చూస్తే భారత్ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్లో చేరిన 11వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇక, సమయం పరంగా చూస్తే భారత్ తరఫున 2,358 రోజుల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
ద్రవిడ్ 2,252 రోజులతో అందరికంటే ముందున్నాడు. సచిన్ (25 ఏళ్ల 301 రోజులు) తర్వాత ఈ ఘనత సాధించిన పిన్క వయస్కుడిగా కోహ్లీ (29 ఏళ్ల 27 రోజులు) నిలిచాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని అందుకున్న రికార్డు క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ పేరిట ఉంది.
గవాస్కర్ 95 ఇన్నింగ్స్ల్లోనే 5000 పరుగులు పూర్తి చేశాడు. సెహ్వాగ్ 99 ఇన్నింగ్స్ల్లో, సచిన్ 103 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.