|
ధోనీ గురించి ఏమీ మాట్లాడలేదు:
ధోనీ రిటైర్మెంట్ గురించి సెలెక్టర్లతో మాట్లాడుతా. ఆపై ధోనీతో కూడా చర్చిస్తా అని గంగూలీ ఇటీవలే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు విరాట్ కోహ్లీకి ప్రశ్న ఎదురైంది. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ... 'ధోనీ భవిష్యత్తు గురించి గంగూలీ నాతో ఏమీ మాట్లాడలేదు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు గంగూలీకి అభినందనలు. గంగూలీ అధ్యక్షుడుగా రావడం గొప్పగా ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నాతో టచ్లో ఉంటాడు. అయితే ఇప్పటివరకూ ధోనీ గురించి కానీ జట్టు గురించి కానీ గంగూలీ నాతో ఏమీ మాట్లాడలేదు' అని స్పష్టం చేసాడు.
ధోనీ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడు
తొలిసారి గంగూలీతో ఏం మాట్లాడుతారో అని అడగ్గా.. 'అక్టోబర్ 24న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంగూలీని కలుస్తా. బీసీసీఐ ప్రెసిడెంట్తో ఒక కెప్టెన్గా ఏం మాట్లాడాలో అప్పుడే మాట్లాడతా' అని అన్నాడు. రాంచీ మ్యాచ్ ముగిసింది, ధోనీ ఇంటికి వెళతారా అని ప్రశ్నించగా.. 'ఈ రోజు ఆటలో ధోనీనే ఇక్కడకు వచ్చి ఆటగాళ్లను కలిసాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడు. రండి హలో చెప్పండి' అని తనదైన స్టయిల్లో సమాధానం ఇచ్చాడు.
బలమైన బ్యాటింగ్ ఆర్డర్ మా సొంతం:
'ఈ సిరీస్ చాలా గొప్పగా సాగింది. సిరీస్ విజయం సమిష్టిగా సాధించాం. భారత జట్టు లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఏ జట్టులోనూ లేదు. స్పిన్ బౌలింగ్ ఎప్పటికీ మా బలం. బ్యాటింగ్ కూడా. ఇక పేస్ బౌలర్లు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. షమీ, ఉమేష్, ఇషాంత్ ఈ సిరీస్లో బాగా రాణించారు. బ్యాటింగ్లో రోహిత్ ఓపెనర్గా విజయవంతమవడం అదనపు బలం. మయాంక్కు అతను సరైన జోడీ. రహానే సైతం ఫామ్లో ఉన్నాడు. లోయర్ ఆర్డర్లో జడేజా, అశ్విన్, సాహాల బ్యాటింగ్ బాగుంది. ఫీల్డింగ్లో సైతం టీమిండియా ప్రమాణాలు మెరుగుపడ్డాయి' అని కోహ్లీ తెలిపాడు.