
హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. కోహ్లీ ఒక్కడే నిలబడి తన అద్భుత ఆటతీరుతో టెస్టుల్లో 21వ సెంచరీని నమోదు చేశాడు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యాన్ని సాధించకుండా అడ్డుపడ్డాడు.
విరాట్ కోహ్లీ 217 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేయడంతో టీమిండియా 300 పరుగుల మైలురాయిని అందుకుంది. అయితే కోహ్లీ 150 పరుగులు సాధించిన తర్వాత మైదానంలో చేసిన ఓ చర్య అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రెండో టెస్టు మూడో రోజైన సోమవారం మోర్కెల్ వేసిన 89వ ఓవర్లో కోహ్లీ 150 పరుగుల ఘనతను అందుకున్నాడు.
ఈ ఫీట్ను సాధించిన సందర్భంగా తన మెడలో ఉన్న ఓ గొలుసును ముద్దాడుతూ కనిపించాడు. తొమ్మిదో సారి టెస్టుల్లో 150 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే తన మెడలో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ను ముద్దాడాడు. వివాహం తర్వాత కోహ్లీ తన వెడ్డింగ్ రింగ్ని వేలికి కాకుండా... దానికి ఓ గొలుసుతో మెడలో వేసుకున్నాడు.
తాజాగా రెండో టెస్టులో 150 పరుగులు సాధించిన సందర్భంగా విరాట్ ఆ ఉంగరాన్ని బయటకు తీసి చూపించి.. దాన్ని ముద్దాడాడు. అనుష్కపై తనకున్న ప్రేమను చాటుతూ.. మరోసారి ఎంగెజ్మెంట్ రింగ్ను కోహ్లీ మైదానంలో ముద్దాడడంతో స్వచ్ఛమైన అనుబంధానికి ఇదే ప్రతీక అంటూ అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.