

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్లు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహాం చిగురించింది. తాజాగా ట్విటర్లో విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్కు పీటర్సన్ తనదైన శైలిలో స్పందించాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇలా మూడు ఐసీసీ అవార్డులను కోహ్లీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిల్యాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం మౌంట్ మాంగనుయ్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో న్యూజిల్యాండ్లో సేదతీరతూ ఉన్న ఓ ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. "సూర్యుడి నులి వెచ్చని కిరణాల వేడిని ఆస్వాదిస్తూ" అని క్యాప్షన్ పోస్టు చేశాడు. ఈ పోస్టుకి పీటర్సన్ తనదైన శైలిలో స్పందించాడు.
"నువ్వు ఎక్కువ భాగంలో నీడలోనే ఉన్నావు బ్రో" అని ట్వీట్ చేశాడు. "నువ్వు నా మొదటి క్యాప్షన్ను చూసుండాల్సింది. నా మొహం ఇంకా ఎండలోనే ఉంది" అని కోహ్లీ సమాధానం ఇచ్చాడు. "నువ్వు ఏదంటే అదే. ఎందుకంటే నువ్వంటే నాకిష్టం" అని పీటర్సన్ సమాధానమిచ్చాడు. పీటర్సన్ టెస్టుల్లో ఇంగ్లాండ్ తరఫును అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ఉన్నాడు.