
హైదరాబాద్: నాగ్పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీసేన మూడు మార్పులతో బరిలోకి దిగింది. ముఖ్యంగా భువనేశ్వర్ స్థానంలో రోహిత్ శర్మకు జట్టులో చోటుదక్కడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి కారణంగా శ్రీలంకతో చివరి రెండు టెస్టులకు భువనేశ్వర్ కుమార్ దూరమైన సంగతి తెలిసిందే.
మరోవైపు తన సోదరి శ్రేష్ట వివాహం కోసం ఓపెనర్ శిఖర్ ధావన్ రెండో టెస్టుకు దూరమైన నేపథ్యంలో అతడి స్ధానంలో మురళీ విజయ్కు జట్టు మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. తుంటి భాగంలో అసౌకర్యంగా ఉండటంతో షమీకి విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో ఇషాంత్ శర్మకు అవకాశం కల్పించారు.
ఇలా రెండో టెస్టులో టీమిండియా మొత్తం మూడు మార్పులతో బరిలోకి దిగింది. అయితే భువీ స్థానంలో పేస్ ఆల్రౌండర్ విజయ్ శంకర్ను తీసుకోకుండా.. ఏడాది తర్వాత రోహిత్ శర్మను టెస్టు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న సగటు క్రికెట్ అభిమాని మదిని తొలిచింది.
గతేడాది అక్టోబర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే అతడికి టెస్టు జట్టులో చోటు కల్పించామని కోహ్లీ అన్నాడు. రోహిత్కు ఇటీవల సరైన అవకాశాలు రావడం లేదని, రానున్న సిరీస్ల కోసం మ్యాచ్ ప్రాక్టీస్గా ఉంటుందనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందన్నాడు.
నాగ్పూర్ టెస్టుకు రోహిత్ శర్మ ఎంపిక అవడంతో ప్రస్తుతం అతడు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాడు. రోహిత్ శర్మ ఎంపికపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.