శ్రీలంక పర్యటనలో టీ20 వరల్డ్ కప్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరో సిరీస్కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ను సద్వినియోగం చేసుకోవాలని, జట్టు కూర్పుపై ఓ అంచనాకు రావాలని టీమిండియా భావిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం విశ్రాంతి తీసుకున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆ మెగాటోర్నీలో విజయానంతరం ఈ ఇద్దరూ టీ20 ఫార్మాట్కు గుడ్బై పలికిన విషయం తెలిసిందే. వన్డే, టెస్టు ఫార్మాట్లో కొనసాగుతామని తెలిపారు. అయితే సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుపై విరాట్ కోహ్లి కన్నేశాడు.

కోహ్లి మరో 152 పరుగులు సాధిస్తే వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.అయితే ఈ మార్క్ను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 18 ఏళ్ల రికార్డును కోహ్లి బద్దలుకొడతాడు. సచిన్ 350 ఇన్నింగ్స్ల్లో 14వేల పరుగులు చేశాడు. కోహ్లి 280 ఇన్నింగ్స్ల్లో 13,848 పరుగులు సాధించాడు. కాగా, ఇప్పటివరకు వన్డేల్లో 14వేల పరుగుల మార్క్ను అందుకున్న ఆటగాళ్లు ఇద్దరే. సచిన్, సంగక్కర. శ్రీలంక మాజీ ప్లేయర్ సంగక్కర ఈ మార్క్ను సాధించడానికి 378 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో కోహ్లి అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. 280 ఇన్నింగ్స్ల్లో విరాట్ 58 సగటుతో 13848 పరుగులు చేశాడు. 72 అర్ధశతకలు, 50 శతకాలు బాదాడు. సచిన్ వన్డే ఫార్మాట్లో 452 ఇన్నింగ్స్ల్లో 44 సగటుతో 18426 పరుగులు చేశాడు. 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు సాధించాడు. కాగా, శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో కోహ్లి సచిన్ 14వేల పరుగుల వేగవంతమైన రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. కొలంబో వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది.