ముంబై: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు బ్రాండింగ్లోనూ దూసుకెళ్తున్నాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాందిచుకున్న.. పలు కంపెనీలకు మోస్ట్ వాంటెడ్ ప్రచార కర్తగా మారిపోయాడు. దీంతో కోహ్లీ ఏకంగా 13 కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కోహ్లీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆర్జిస్తున్న వారి జాబితాలోకి చేరిపోయాడు.
మైదానంలో తన ఆటతో మెప్పించడమే కాకుండా.. మైదానం బయట స్టైలీష్ గెటప్స్తోనూ యూత్ను అట్రాక్ట్ చేస్తున్నాడు ఈ 27ఏళ్ల ఆటగాడు. ఈఎస్పీ ప్రాపర్టీస్-స్పోర్ట్పవర్ రిపోర్ట్ 2015 ప్రకారం.. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థ అడిడాస్తో 2014లో రూ.10 కోట్ల వార్షిక బ్రాండింగ్ డీల్ కుదుర్చుకోవడం ద్వారా యాడ్ ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటిచెప్పాడు.
ఇంతకుముందు అడిడాస్కు మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. కాగా, కోహ్లీ తన రెండో అతిపెద్ద బ్రాండింగ్ డీల్ను ప్రఖ్యాత టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్తో కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకు ఏటా ఆయనకు రూ.6.5 కోట్లు లభించనున్నాయి.

అడిడాస్, ఎంఆర్ఎఫ్తోపాటు పెప్సీ, ఆడీ, టిస్సాట్ వంటి అంతర్జాతీయ సంస్థల తరపునా కోహ్లీ ప్రచారం చేస్తున్నారు. వీటితోపాటు దేశీయంగా విక్స్, బూస్ట్, యూఎస్ఎల్, టీవీఎస్, స్మాష్, నితేష్ ఎస్టేట్, హెర్బాలైఫ్, కోల్గేట్ బ్రాండ్లకు సైతం బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 13 బ్రాండ్లకు ఎండార్స్మెంట్లు చేస్తున్న కోహ్లీ రూ. 100 కోట్ల క్లబ్లో చేరాడని ఈస్పీ ప్రాపర్టీస్-స్పోర్ట్స్ పవర్ అనే సంస్థ తెలిపింది.
టీమిండియా వన్డే, టీ-20 కెప్టెన్ ధోనీ ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరు. త్వరలోనే ధోనీ రేంజ్ను కోహ్లీ దాటేయొచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఆన్ఫీల్డ్లో కల్పించే ప్రచారానికి సైతం క్రికెటర్లకు పెద్దమొత్తంలో సొమ్ము ముడుతుంది. ఉదాహరణకు వారు వాడే బ్యాట్లపై అంటించుకునే స్టిక్కర్లు, ధరించే షూస్, దుస్తుల విషయంలోనూ వాణిజ్య అంశాలు మిళితమై ఉంటాయి.
ఉదాహరణకు ధోనీ తన బ్యాట్పై స్పార్టన్ స్టిక్కర్ అంటించుకుంటారు. ఇందుకుగాను ఆయనకు రూ.6 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అదే కోహ్లీ బ్యాట్పై ఎంఆర్ఎఫ్ స్టికర్ అంటించి ఉంటుంది. దీనికి ఆయనకు లభించే మొత్తం రూ.8 కోట్లు. అంటే ఆన్ఫీల్డ్లో కోహ్లీ.. ధోనీని కూడా దాటేశాడు. ఇక షూస్, దుస్తులు ఉపయోగించినందుకు గాను కోహ్లీకి రూ.2 కోట్లదాకా లభిస్తాయట. టీవీ యాడ్ల విషయంలో మాత్రం ఇప్పటికీ ధోనీదే అగ్రస్థానంలో ఉన్నాడు.
ఒక్కో టీవీ యాడ్కు ఆయన ఏటా రూ.8 కోట్లు వసూలు చేస్తుంటే .. కోహ్లీకి రూ.5 కోట్ల వరకు ముడుతుందట. క్రికెటర్లలో ధోనీ, కోహ్లీ, యువరాజ్ సింగ్ ప్రచారకర్తగా నిర్వహిస్తున్న వాటికి మార్కెట్లో డిమాండ్తోపాటు కంపెనీల సేల్స్ కూడా పెరుగుతున్నాయని ఓ స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థకు చెందిన సీఈవో పేర్కొన్నారు.