న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇటీవల కాలంలో పోల్చే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరి పోలికపై ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ పెదవి విప్పారు.
ఓ ఇంటర్యూలో ఆడమ్ గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ వారిద్దరూ బ్యాటింగ్ శైలి పూర్తిగా వేరని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ 'నెక్ట్స్ జనరేషన్' ఆటగాడని కితాబిచ్చాడు. ప్రత్యర్ధి జట్టుకు అతను ఆఫర్ ఇచ్చినట్లే ఉండాడు కానీ అతి రిస్క్తో కూడుకుని ఉంటుందని గిల్ క్రిస్ట్ తెలిపాడు.
ప్రత్యర్ధి జట్టు నుంచి ఆటను చాలా త్వరగా దూరం చేస్తాడని కొనియాడాడు. ఇక సచిన్ విషయానికి వస్తే ప్రత్యేకం. సచిన్ను ఎంత త్వరగా ఔట్ చేస్తే ప్రత్యర్ధి జట్టుకు అంత మంచిది. జట్టు స్కోరుని నిర్మించడంలో సచిన్ శైలే వేరని కొనియాడాడు. తాను క్రికెట్ ఆడిన కాలంలో అత్యుత్తమ ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ ఒకడని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు.

అయితే విరాట్ కోహ్లీ తన కెరీర్ను ముగించే నాటికి సచిన్ లాగా అత్యున్నత శిఖరాలను అందుకుంటాడని పేర్కొన్నాడు. ఇక టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 2016లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది కోహ్లీ ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన ఫామ్ని కొనసాగిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర ధోని పూర్తిగా ఫిట్నెస్ ఉన్నంత వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగాలని గిల్ క్రిస్ట్ సూచించాడు. ఇక టీమిండియా సెలక్టర్లు సైతం ధోని 2019లో జరగనున్న వరల్డ్ కప్ వరకు కొనసాగాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
ధోని సైతం వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగాలని ఇటీవల తన మనసులోని మాటలను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ధోని నేతృత్వంలోని టీమిండియా భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరిస్లో కూడా ధోని సేన విజయాన్ని సాధించింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జట్టులో సమతుల్యత చక్కగా ఉందని ఇదే జట్టుని 2019 వరకు కొనసాగించాలనే ఆలోచనకు సెలక్టర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ పరంగా ధోని చక్కగా ఉన్నాడని, వచ్చే వరల్డ్ కప్ వరకు ధోని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే సెలక్టర్లకు కూడా వారి జాబ్ సులభం అవుతుందని కమిటీలోని సభ్యుడు ఒకరు తెలిపారు.