హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జెండా వంటి వాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. సఫారీ గడ్డపై కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనలో అటు కెప్టెన్గా ఇటు బ్యాటింగ్లోనూ కోహ్లీ రాణించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గంగూలీ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో 'విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జెండా వంటి వాడు. నేను క్రికెటర్లు అత్యద్భుత ఫామ్ కలిగిన సందర్భాలు ఎన్నో చూశా. వ్యక్తిగతంగా నాది, సచిన్, ద్రవిడ్లది కావొచ్చు. కానీ కోహ్లీది అలాంటిది కాదనుకుంటున్నా. ఇది ఓ జీనియస్ గొప్పతనమని భావిస్తున్నా' అని గంగూలీ అన్నాడు.
'కోహ్లీ పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ విజయాలు నమోదు చేసింది. త్వరలో పర్యటించే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లలో కెప్టెన్గా తానేంటో తెలియజేస్తాడు. నేను కెప్టెన్గా ధోని, రాహుల్ ద్రవిడ్లను చూశా. కానీ ఇలా స్థిరంగా పరుగులు చేసే కెప్టెన్ను ఇప్పటి వరకు చూడలేదు' అని దాదా పేర్కొన్నాడు.
కెప్టెన్గా కోహ్లీ విదేశీ పర్యటనల్లో భారత్కు టెస్టు సిరీస్ విజయాలను అందిస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనకు కోహ్లీసేన ముందుగా వెళ్తే బాగుంటుందని కోహ్లీసేనకు గంగూలీ సూచించాడు. ఈ సిరీస్లకు ముందే కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుస్తాయని దాదా అన్నాడు.