
హైదరాబాద్: టీమిండియాకు మరో ఏడేళ్లు కెప్టెన్గా కొనసాగే సత్తా విరాట్ కోహ్లీకి ఉందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. బుధవారం ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో 'మా ఇద్దరి అభిరుచులు ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. నమ్మకం అనేది మా బంధాన్ని మరింత బలపరుస్తోంది. మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం ఎక్కువ. ఇద్దరం జట్టు విజయాల కోసమే కష్టపడతాం' అని అన్నాడు.
'మ్యాచ్ ముగిసిన రోజు కెప్టెనే బాస్. ఆటలో భాగంగా అతడు నా సలహాల్ని తీసుకుంటాడు. కానీ, అవి ఫాలో అవ్వాలి అన్న నిబంధన ఏమీ లేదు. నా సూచనలు అతనికి నచ్చొచ్చు. నచ్చకపోవచ్చు. మేమంతా టీమిండియాకు మద్దతుదారులం మాత్రమే. తుది నిర్ణయాలు కెప్టెన్వే. మరో ఏడెనిమిదేళ్లు టీమిండియాకు కోహ్లీనే నాయకత్వం వహించే సత్తా ఉంది' అని శాస్త్రి అన్నాడు.
'ఒకపక్క జట్టు కోసం ఆడుతూనే మరో పక్క కెప్టెన్గా జట్టుని నడిపించాలి. ఆ సత్తా కోహ్లీలో ఉంది. ప్రస్తుత టీమిండియా విజయాల కోసమే ఆడుతోంది. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ నెగ్గడం, ఆసీస్పై విజయం సాధించడం, వెంటవెంటనే శ్రీలంకపై సిరీస్లు గెలుపొందడం ఇవన్నీ టీమిండియా మైలురాళ్లు' అని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా విజయవంతంగా పూర్తిచేస్తుందని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. 'దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో టీమిండియా ఇప్పటిదాకా ఒక్క సిరీస్ గెలవలేదు. కోహ్లీసేన నేతృత్వంలోని టీమిండియాకు ఆ సత్తా ఉంది. గెలుస్తారన్న నమ్మకం నాకుంది. దక్షిణాఫ్రికా, భారత్ బౌలింగ్ బలాబలాలు ఒకేలా ఉన్నాయి. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. భారత బౌలర్లు 20 వికెట్లు తీయగలరు' అని శాస్త్రి తెలిపాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ కంటే శిఖర్ ధావనే అయితే బాగుంటుందని అన్నాడు. 'ధావన్కు అనుభవం, టెక్నిక్ ఉన్నాయి. విదేశాల్లో మురళీ విజయ్ ప్రతిభ నిరూపించుకున్నాడు. కుడి ఎడమ బ్యాటింగ్ కాంబినేషన్ నేపథ్యంలో శిఖర్కే ఎక్కువ అవకాశాలున్నాయి. కేఎల్ రాహుల్ ఈ ఏడాది చాలా బాగా ఆడుతున్నాడు. అయితే హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచలేకపోతున్నాడు' అని అన్నాడు.
ఇక, రహానే ఫామ్పై ఆందోళన అవసరం లేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. 'రహానె ఫామ్పై ఆందోళన లేదు. ఈ దశలో కోచ్గా నేను అతడికి కొత్తగా చెప్పేదేమీ లేదు. దక్షిణాఫ్రికాలో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా? లేక ఒక్కరినే ఆడించాలనే నిర్ణయించడం చాలా కష్టం. జడేజా, అశ్విన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులను బట్టి ఎవరు ఆడతారనేది నిర్ణయిస్తాం' అని పేర్కొన్నాడు.

'ముగ్గురు పేసర్లు అవసరమైతే హార్దిక్ పాండ్యా బ్యాలెన్స్ చేస్తాడు. వికెట్ను బట్టి ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటాం. స్పిన్నర్ల విషయంలో నిర్ణయాన్ని కోహ్లీ తీసుకుంటాడు' అని రవిశాస్త్రి పేర్కొన్నారు. కాగా, లంక సిరిస్ అనంతరం కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జనవరి 5న కేప్ టౌన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.