వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోసం దాదాపు టీమిండియా సభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా లండన్లోనే తన భార్యతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్ వెళ్లిన బృందం కూడా ఇంకా తమ ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు. దీంతో కోహ్లీ ఇంకా అక్కడకు వెళ్లలేదు. లండన్లోనే భార్యతో కలిసి షికార్లు కొడుతున్నాడు.
తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఒక హోటల్లో ఫుడ్ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను కోహ్లీ భార్య, బాలీవుడ్ భామ అనుష్క శర్మ తన ఇన్స్టాలో షేర్ చేసింది. దీనికి 'ఫుల్ ఎంజ్వే' అంటూ క్యాప్షన్ తగిలించింది. వీళ్లిద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఫొటోలు కూడా ఆమె షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కోహ్లీ వెస్టిండీస్ ఎప్పుడు చేరుకుంటాడో అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.

కోహ్లీ చివరగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో అవుటైపోయాడు. రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీకి చేరువైన అతను.. జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. రహానేతో కలిసి అతను జట్టును ఆదుకుంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో రెక్లెస్ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు.
ఈ ఏడాది ఆరంభం నుంచి వైట్ బాల్ క్రికెట్లో మంచి ఫామ్ కనబరుస్తున్న కోహ్లీ.. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా తన పూర్వపు బెస్ట్ స్థాయి అందుకోలేదనే చెప్పాలి. ఈ క్రమంలో విండీస్తో జరిగే టెస్టు సిరీస్ అతని కెరీర్కు చాలా కీలకం కానుంది. పుజారా వంటి సీనియర్పై ఇటీవలే సెలెక్టర్లు వేటు వేసిన నేపథ్యంలో.. ఈ సిరీసులో కనుక రాణించకపోతే కోహ్లీని టెస్టు జట్టు నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదు.