
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే ఔట్ కావడంతో అతనిపై విమర్శలు పెరిగాయి. టీంలో నుంచి తీసేయాలంటూ చాలా మంది పేర్కొంటున్నారు. ఇకపోతే రెండో టీ20లో విరాట్ కోహ్లీ చాలా నిస్వార్థంగా వ్యవహరించాడని ప్రముఖ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు. అసలు పీయూష్ చాహ్లా విరాట్ కోహ్లీ ఔటవ్వడంలో ఎలా నిస్వార్థంగా వ్యవహరించాడో కూడా క్లారిటీ ఇచ్చాడు.
ఇకపోతే సౌతాంప్టన్లోని రోజ్బౌల్లో జరిగిన సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్కు కోహ్లీ అందుబాటులో లేడు. రెండో మ్యాచ్లో దీపక్ హుడా స్థానంలో కోహ్లీ బరిలోకి దిగాడు. ఇక రెండో టీ20లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ రిచర్డ్ గ్లీసన్ తొలుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఇక పవర్ ప్లే పూర్తయ్యాక రెండోసారి అతను బౌలింగ్ చేయగా.. 7వ ఓవర్ తొలి బంతి విరాట్ కోహ్లీ ఎదుర్కొన్నాడు. ఆఫ్ స్టంప్ వైపు పడ్డ బంతిని కోహ్లీ భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. అయితే బంతి గాల్లోకి లేచింది. గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ మలన్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో విరాట్ కేవలం ఒక్క రన్కే అవుటయ్యాడు.
ఇక చావ్లా కోహ్లీని సమర్థించేలా కామెంట్లు చేశాడు. కోహ్లీ తన బ్యాటింగ్ కంటే జట్టుకు ఏం కావాలో దాన్ని అందించడానికి ప్రయత్నించాడని తెలిపాడు. అందుకే హిట్టింగ్కు దిగాడని ఫలితంగా ఔటవ్వాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇకపోతే కోహ్లీ ప్రస్తుతం చాలా స్ట్రగుల్ ఫేజ్లో ఉన్నాడని చెప్పాడు. 'విరాట్ కోహ్లీ జట్టు కోసం ఆడాడు. అప్పటికే స్కోరు బాగుంది. జట్టు ఆడుతున్న అటాకింగ్ బ్రాండ్ క్రికెట్ను తాను కూడా కొనసాగించాలనుకున్నాడు. అందుకే బంతిని హిట్ చేయాలని చూశాడు. అతను గొప్ప ఫామ్లో లేకపోయినా.. తనను తాను డిఫెండ్ చేసుకునే ఆట కోసం కాకుండా.. జట్టుకు ఏది అవసరమో అలా ఆడాలని జట్టుకే ప్రాధాన్యం ఇచ్చాడు. అతను ఎప్పుడు తనకంటే జట్టుకే ప్రాధాన్యం ఇచ్చే ప్లేయర్' అని చావ్లా ఈఎస్పీఎన్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. గత 18నెలలుగా మనం మిస్సయిన కోహ్లీని మళ్లీ తప్పకుండా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.