
మొహాలి స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఆసీస్ మధ్య సెప్టెంబర్ 20న మూడు మ్యాచ్ల T20సిరీస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో పోరు అంటే అందరి దృష్టి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. 2022ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో సెంచరీతో మునుపటి టచ్ చూపించిన కోహ్లీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా సిరీస్లో బరిలోకి దిగబోతున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన కోహ్లి ఆసియా కప్ టోర్నీ ద్వారా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్గా కూడా కోహ్లీ నిలిచాడు. ఇక ఐకానిక్ మొహాలి మైదానంలో కోహ్లీ తన టీ20 ఫేవరేట్ ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో బరిలోకి దిగబోతుండడంతో సర్వత్రా అతని మీద ఫోకస్ ఉంది. 2016 టీ20 ప్రపంచకప్లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లో కోహ్లీ 82పరుగులతో విజృంభించి ఆడడం ఎవరూ మర్చిపోరు.
కోహ్లీ ఆసియా కప్ 2022లో రెండు హాఫ్ సెంచరీలు సాధించడమే కాకుండా 1020రోజుల తర్వాత తన అంతర్జాతీయ సెంచరీ కరువును కూడా తీర్చుకున్నాడు. 5మ్యాచ్లలో 92సగటుతో 276పరుగులు చేశాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ కూడా 147గా ఉండడం గమనార్హం. మంచి ఫామ్ పుంజుకున్నాక విరాట్ కోహ్లీ T20లలో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుండడంతో మరోసారి అతను రచ్చరేపేలా ఆడడం ఖాయంగా కన్పిస్తోంది. కంగారూ జట్టుపై అత్యధిక పరుగుల స్కోరర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 33ఏళ్ల కోహ్లీ ఆస్ట్రేలియాపై కేవలం 19 టీ20ల్లో 718పరుగులు చేశాడు. 59.83సగటుతో ఈ పరుగులు చేయడం గమనార్హం. ఆస్ట్రేలియాపై కోహ్లీ స్ట్రైక్ రేటు 146.23గా ఉంది.