మరో రికార్డుపై కన్ను:
ఇక న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేసాడు. ఈసారి భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాళ్ల జాబితాలో గంగూలీని కోహ్లీ అధిగమించనున్నాడు. కోహ్లీ కేవలం 11 పరుగులు చేస్తే.. దాదాను అధిగమించి అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆరో భారత క్రికెటర్గా నిలుస్తాడు.
కేవలం 11 పరుగులు:
ప్రస్తుతం విరాట్ కోహ్లీ 7,202 పరుగులతో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో మరో 11 పరుగులు చేస్తే.. గంగూలీ (7,212) ని అధిగమించి ఆరో భారత క్రికెటర్గా నిలుస్తాడు. కోహ్లీ 84 మ్యాచ్లలో 7,202 పరుగులు చేయగా.. గంగూలీ 113 టెస్టుల్లో 7,212 పరుగులు చేశాడు.
సచిన్@1:
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేసాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13,288), సునిల్ గవాస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8,718), వీరేంద్ర సెహ్వాగ్ (8,586)లు ఉన్నారు. ఆ తర్వాత దాదా, కోహ్లీలు ఉన్నారు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న తొలి టెస్టులో దాదాని కోహ్లీ అధిగమిస్తాడని భావిస్తున్నారంతా.
కేవలం ఒక్క విజమే:
వెల్లింగ్టన్లో ఏడు టెస్టులాడిన భారత్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. 1968లో ఎంకే పటౌడీ నాయకత్వంలో టెస్టు విజయాన్ని అందుకుంది. అప్పటి నుండి ఇప్పటివరకు ఇక్కడ ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు. వెల్లింగ్టన్ టెస్టులో భారత్ గెలిస్తే.. పటౌడీ సరసన నిలిచే అరుదైన అవకాశం కోహ్లీకి దక్కనుంది.
కోహ్లీకి అసలైన సవాల్:
వన్డే, టీ20 సిరీస్లో పరుగులు చేయలేకపోయిన విరాట్ కోహ్లీకి టెస్టు సిరీస్ రూపంలో అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. ఐదు టీ20లలో 105 పరుగులు, మూడు వన్డేలలో 75 పరుగులే చేసిన కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా గాడిలో పడుతాడేమో చూడాలి. మరోవైపు రోహిత్ శర్మ కూడా దూరమవడంతో కోహ్లీపై మరింత భారం పడనుంది.