
హైదరాబాద్: టీమిండియా గెలుస్తున్నంత కాలం తాను పరుగులు చేయకపోయినా పర్వాలేదంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యల్ని ఇంగ్లాండ్ సీనియర్ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ విభేదించాడు. ఇలా అంటే కోహ్లి అబద్ధమాడుతున్నట్లే అని అతనన్నాడు. క్రితం సారి ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ దారుణ ఆటతీరుతో విమర్శల పాలయ్యాడు.
ఐదు టెస్టుల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా రూపొంది బౌలర్లకు సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జరగబోయే ఐదు టెస్టుల సిరీస్లో కోహ్లీ రాణింపుపై అందరికీ ఆసక్తిగా ఉంది.
కానీ జట్టు గెలిచినంత కాలం తాను పరుగులు చేసినా.. చేయకపోయినా పెద్ద విషయం కాదని కోహ్లీ చెప్పడంపై ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తప్పుపట్టాడు. 'విరాట్ పరుగులు చేసినా చేకపోయినా పర్వాలేదా? ఇక్కడ అతను అబద్ధమాడుతున్నట్లే లెక్క. ఇంగ్లాండ్లో భారత్ గెలవడం చాలా ముఖ్యమే కావచ్చు. కానీ తన జట్టు కోసం కోహ్లి పరుగులు చేయాలని తపిస్తాడు. పైగా అతను కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్లో ఒకడు కూడా' అని అండర్సన్ అన్నాడు.
గత రెండు ఇంగ్లాండ్ పర్యటనల్లో కోహ్లి విఫలమైనప్పటికీ.. ఈసారి అలాగే ఆడతాడనుకోవడానికేమీ లేదని అండర్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రతి ఆటగాడూ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడని.. అన్నాడు. రాబోయే సిరీస్లో అతడికి, తమ బౌలర్లకు పోరు రసవత్తరంగా ఉంటుందని అండర్సన్ చెప్పాడు.