
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ (160 నాటౌట్: 159 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు)తో కెరీర్లో 34వ సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా కేప్టౌన్ పిచ్పై కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్పై అటు భారత మాజీ క్రికెటర్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీ క్రికెటర్లను సైతం ముగ్ధులను చేసింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పిచ్లపై కోహ్లీ ఆడుతున్న తీరు అతని అమోఘమైన బ్యాటింగ్ టెక్నిక్ని నిదర్శనమని జావెద్ అభిప్రాయపడ్డాడు.
ఓ పాకిస్థానీ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్యూలో జావెద్ మియాందాద్ మాట్లాడుతూ 'కోహ్లీ జీనియస్, ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్' అని చెప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ క్రీజులో నిలుస్తున్న తీరు.. లక్ష్య ఛేదనలో అతను జట్టుని విజయతీరాలకి చేర్చుతున్న విధానం దిగ్గజాల సరసన నిలబెడుతోందని తెలిపాడు.
'విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ అతడికి పరుగులు ధారాళంగా రావడానికి కారణం అవుతుంది. టెక్నిక్లేని బ్యాట్స్మెన్ ఏదో ఒక్కసారి మాత్రమే స్కోరు చేయగలడు. కోహ్లీ లాంటి గొప్ప బ్యాట్స్మెన్ ప్రత్యర్థి బౌలర్ల బలాలు, బలహీనతల్ని వేగంగా అంచనా వేసి వారిపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఇలా అంచనా వేయడంలో కోహ్లీ జీనియస్గా చెప్పుకోవచ్చు. అందుకే అతను ప్రపంచంలోనే మేటి బ్యాట్స్మెన్' అని మియాందాద్ ప్రశంసించాడు.
తాజా సెంచరీతో విరాట్ కోహ్లీ టెస్టులు, వన్డేల్లో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. వన్డేల్లో 34వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (టెస్టుల్లో 21) మొత్తంగా తన సెంచరీల సంఖ్యను 55కు పెంచుకున్నాడు. తద్వారా 54 సెంచరీలతో ఉన్న ఆమ్లా, జయవర్దనెలను కోహ్లీ వెనక్కునెట్టాడు.
ఈ జాబితాలో వంద సెంచరీలతో సచిన్ (51+49) అగ్రస్థానంలో ఉండగా రికీ పాంటింగ్ (71), కుమార సంగక్కర (63), జాక్వస్ కలిస్ (62) తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (49) తర్వాత విరాట్ కోహ్లీనే ఉండటం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.