
హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై గత పర్యటనలో విఫలమైన కోహ్లీ ఈసారి మాత్రం తన రికార్డును మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ గ్రాహమ్ గూచ్ అభిప్రాయపడ్డాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కోహ్లీసేన తలపడనుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో గ్రాహమ్ గూచ్ మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ ప్లేయర్ కోహ్లీ ఇంగ్లండ్ జట్టుకు ప్రమాదకరమే. ఎందుకంటే అతను ఇంగ్లండ్లో తన రికార్డును మెరుగు పరుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రతి ఆటగాడికి విదేశాల్లో రాణించాలని ఉంటుంది" అని అన్నాడు.
విరాట్ కోహ్లీ, జో రూట్లలో ఎవరు బెస్ట్ అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే అని అన్నాడు. "ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్రికెటర్ ఏ ఫార్మాట్ అయినా ఆకలింపు చేసుకుంటున్నాడు. వీరిలో ఎవరు గొప్ప అని చెప్పడం మాత్రం కష్టమే. ఇద్దరు మ్యాచ్ విన్నర్సే. ఇద్దరి ఆటను ఆస్వాదించడానికి ఇష్టపడుతాను. పరుగులతో ఎవరు గొప్ప అని చెప్పలేం. పరిస్థితుల దగ్గట్టు ఆడినవారే గొప్పవారు. కొన్ని సందర్భాల్లో సెంచరీల కన్నా హాఫ్ సెంచరీలు కూడా కీలకం అవుతాయి" అని గూచ్ అన్నాడు.
గతంలో కంటే టీమిండియా ప్రదర్శన ఎంతో మెరుగుపడిందని గూచ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్తో టెస్టు సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు."గత విదేశీ పర్యటనల్లో భారత ఆట దారుణంగా ఉండేది. సొంతగడ్డపై బలంగా ఉండే టీమిండియా.. ఇప్పుడు విదేశాల్లోనూ అద్భుత ఆటను కనబరుస్తోంది. తనను తాను నిరూపించుకోవాలని కోహ్లీ కూడా పట్టుదలతో ఉన్నాడు. ఆ జట్టులో మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు" అని గూచ్ అన్నాడు.