
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఫార్మాట్ ఏదైనా సరే కోహ్లీ దూకుడు ముందు ప్రత్యర్థి బౌలర్లు దాసోహామవ్వాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్లో 35 సెంచరీలు బాది ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
వన్డేల్లో విరాట్ కోహ్లీ చేసిన 21 సెంచరీలు ఛేజింగ్లో చేసినవే కావడం విశేషం. మొత్తం 211 వన్డేలాడిన విరాట్ కోహ్లీ 58.20 సగటుతో 9779 పరుగులు చేశాడు. ఇక, టీ20ల్లో 48.88 సగటుతో 2102 పరుగులు చేశాడు. టెస్టుల్లో కోహ్లీ సగటుగా 53.40గా ఉంది. టెస్టుల్లో కోహ్లీ ఇప్పటికే 21 సెంచరీలు సాధించాడు.
ఇందులో 6 డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. ఈ గణాంకాలు చాలు మోడ్రన్ డే క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో. దీంతో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న కోహ్లీ ఆల్ టైమ్ టాప్-10 అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసించాడు.
ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్ల సరసన విరాట్ కోహ్లీ పేరును చేర్చొచ్చని తెలిపాడు. టీమిండియా విజయాల్లో బౌలర్ల పాత్ర గురించి ప్రస్తావించగా.. అశ్విన్ కీలక పాత్ర పోషించాడని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
విదేశీ పర్యటనల్లో రవిచంద్రన్ అశ్విన్ రాణిస్తాడనే ఆశాభావాన్ని కపిల్ దేవ్ వ్యక్తం చేశాడు. గత 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బౌలరూ తక్కువ సమయంలో అశ్విన్లా ఎక్కువ వికెట్లు తీయలేదని కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.