హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా విదేశాల్లో కూడా విజయం వంతం అవుతుందని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ ద్రవిడ్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.
ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ శైలి అద్భుతంగా ఉందని, జట్టులోకి బ్యాట్స్మెన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నారని తెలిపాడు. యువ ఆటగాళ్లు ఇప్పుడు ఎదిగే దశలో ఉన్నారని తెలిపాడు. విదేశీ పర్యటనలకు వెళ్లి సమయానికి భారత బ్యాటింగ్ లైనప్ గాడిలో పడనుందని అనుకుంటున్నానని అన్నాడు.

ముఖ్యంగా విదేశాల్లో విజయాలు సాధించాలంటే మిడల్ ఆర్డర్ ఎంతో పటిష్టంగా ఉండాలని, తద్వారా విజయాలు సాధించే అవకాశం ఉందని ద్రవిడ్ సూచించాడు. మిడిల్ ఆర్డర్కు ఎలాంటి స్థితిలోనైనా బ్యాటింగ్ చేయగలుగుతుందని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ రాణిస్తే అన్ని పరిస్థితుల్లో టీమిండియా సత్తా చాటుతుందనన్నాడు.
గతంలో తాను రాణించిన మూడో స్ధానంలో ఛటేశ్వర పుజారా అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. ఇంగ్లాండ్ సిరిస్లో అతని ఆటతీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. అద్భుతమైన టెస్టు ప్లేయర్. రాబోయే రోజుల్లో టీమిండియా విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని అనుకుంటున్నానని అన్నాడు.
ఇక రహానె కూడా అద్భుతమైన ఆటగాడని కితాబిచ్చాడు. ఇక కోహ్లి ఓ సంచలనం అని అన్నాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో మ్యాచ్ విన్నర్లు ఎక్కువగా ఉన్నారని ద్రవిడ్ అన్నాడు. అప్పట్లో సెహ్వాగ్, తాను, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఇలా అందరం జట్టుకు అద్భుతమైన విజయాలను అందించామన్నాడు.
ఇక లోధా కమిటీ సిఫార్సులను ఎలా అమలు చేయాలనేది బీసీసీఐ తేల్చు కోవాల్సిన విషయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.