
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జూన్లో కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడనున్నట్టు ఇంతకముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా వార్తలకు బలం చేకూరిస్తూ సర్రే క్లబ్ అధికారిక ప్రకటన చేసింది.
విరాట్ కోహ్లీకి వెల్కమ్ పలుకుతూ సర్రే క్లబ్ తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. సర్రే క్లబ్ తరుపున విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ ఆడనున్నట్టు తెలిపింది. సర్రే క్లబ్తో చేసుకున్న ఒప్పందంతో క్లబ్ క్రికెట్కు ఆడుతున్న ఐదో భారతీయుడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
ప్రస్తుతం ఛటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్, వరుణ్ అరోరాలు యార్క్షైర్, సస్సెక్స్, డుర్హమ్, లీసెస్టైర్ తరుపున కౌంటీల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. వన్డే కప్లో భాగంగా రాయల్ లండన్లో మిడిల్సెక్స్తో జరిగే మ్యాచ్లో కోహ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'క్లబ్ క్రికెట్ ఆడాలన్న కోరిక చాలా కాలంగా ఉందని, తన కోరిక తీరుస్తున్నందుకు అలెక్ స్టివార్ట్, సర్రే క్లబ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక తాను ఆగలేను' అని పేర్కొన్నాడు. మరోవైపు ప్రపంచ క్రికెట్లోని అత్యత్తుమ ఆటగాడితో ఒప్పందం కుదరడం తనను థ్రిల్కు గురిచేసిందని సర్రే డైరెక్టర్ అలెక్ స్టివార్ట్ పేర్కొన్నాడు.
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన విరాట్ కోహ్లీతో ఆడుతూ శిక్షణ తీసుకోవడం తమ ఆటగాళ్లకు ఎంతో కలిసొస్తుందని అలెక్ స్టివార్ట్ పేర్కొన్నాడు. ఈ అవకాశాన్ని తమ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.