న్యూఢిల్లీ: ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయన్నందించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కోహ్లీ విన్నింగ్ ఇన్నింగ్స్తో టీమిండియా సెమీస్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
కాగా, 1983 ప్రపంచ కప్ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ లక్ష్య ఛేదన ప్రతి ఒక్కరినీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసిందని తెలిపారు. ఇది విరాట్ కోహ్లికి.. టీం ఇండియాకు మరిచిపోలేని రాత్రిగా అభివర్ణించారాయన. ఆస్ట్రేలియా తీవ్రంగా పోరాడినా భారత్ విజేతగా నిలిచిందన్నారు.
ఆస్ట్రేలియన్ల ధాటికి ప్రారంభంలో భారత్ కొంత తడబాటుకు గురైనా.. తిరిగి గాడిలో పడటంతో విజయతీరాలకు చేరిందని తెలిపారు. జట్టులో యువరక్తం.. అనుభవజ్ఞుల మేలు కలయికకు విరాట్ ఇన్నింగ్స్ తోడై భారత్ను విజయం వైపు నడిపించిందని చెప్పారు. ఆరంభంలో ఒత్తిడికి గురైన విరాట్ తర్వాత భారత ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించాడని అన్నారు.
జట్టు అవసరాలు విరాట్కు బాగా తెలుసని.. అందుకే స్పష్టమైన అవగాహనతో బ్యాటింగ్కు దిగి చెలరేగిపోతున్నాడని తెలిపారు. అతని మానసిక దృఢత్వానికి నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటానని చెప్పారు. ఎంత ఒత్తిడినైనా ఎదుర్కొని పోరాడే అతని ఆత్మవిశ్వాసం అద్భుతమని తెలిపారు.

ఆస్ట్రేలియా పోరాటంలో పదును తగ్గిందని, మరో పక్క విరాట్, ధోనీలు అలవోకగా పరుగులు చేస్తుండటంతో పరిస్థితి భారత్కు అనుకూలంగా మారిందన్నారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు నిస్సందేహంగా విజయం భారత్దే అనుకున్నానని చెప్పారు. వీరు వికెట్ల మధ్య పరుగులు తీసే విధానం కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
మ్యాచ్ మొత్తంలో ఇదే రసవత్తరంగా కొనసాగిందన్నారు. ఒకనొక దశలో తీవ్రమైన ఒత్తిడికి గురైన ఆస్ట్రేలియా ఫీల్డర్లు తడబాటుకు గురయ్యారని తెలిపారు. భారత్ జట్టులో ఉన్న కోహ్లీ వంటి ఆటగాడు ఆస్ట్రేలియాకు లేడని, అదే పెద్ద తేడా తెలిపారు. కోహ్లీ ఇన్నింగ్స్ అన్నిరకాల ప్రశంసలకు పూర్తిగా అర్హమైందన్నారు. ఎవరైన ఇటువంటి ఇన్నింగ్స్ను మళ్లీమళ్లీ చూడాలనుకుంటారని తెలిపారు.
'ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తూ ఈ టోర్నమెంట్లో ధోనీ తొలిసారి యువరాజ్ సింగ్ చేతికి బంతిని అందించాడు. తన వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్మన్ని బోల్తా కొట్టించడంలో యువీ దిట్ట. తన తొలిబంతికే స్టీవెన్ స్మిత్ను పెవీలియన్ బాటపట్టించాడు. దీంతో మ్యాచ్పై భారత్ పట్టు సాధించింది' అని కపిల్ తెలిపారు.
'ఆస్ట్రేలియా ఫించ్ వికెట్ కోల్పోవడం మ్యాచ్ను మలుపు తిప్పింది. దీంతో భారత్ వూపిరి పీల్చుకుంది. ఫించ్ తొలుత కొంత ఇబ్బంది పడినా తర్వాత తన బ్యాట్ను ఝళిపించాడు. మ్యాక్స్ వెల్ పోరాడాలని ప్రయత్నించినా పిచ్పై బంతిని అంచనావేయలేకనిలదొక్కుకోలేక పోయాడు' అని విశ్లేషించాడు.
ఈ మ్యాచ్ లో ధోనీ కూడా అద్భుతంగా ఆడాడని కొనియాడారు. ఈ సమయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్లు బౌలర్లపై ఎదురు దాడి చేసినా భారత కెప్టెన్ చెక్కుచెదరలేదన్నారు. అతని అత్యుత్తమ బౌలర్లు కూడా ఎటువంటి ప్రభావం చూపని సమయంలో అమ్ములపొది నుంచి యువరాజ్ను బయటకు తీశాడని విశ్లేషించారు.
యువరాజ్ అనుభవంపై అది అతనికి ఉన్న నమ్మకమని తెలిపారు. మొదటి ఐదు ఓవర్లలో మినహాయించి ఆశీష్ నెహ్రా కూడా ఆస్ట్రేలియన్లను కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడని, కానీ ఆస్ట్రేలియా ఓ మంచి ఇన్నింగ్స్ను ఆడిందని తెలిపారు. యువరాజ్ ఇన్నింగ్స్ కూడా భారత విజయంలో కీలకమేని తెలిపారు. అయితే మ్యాచ్ మొత్తంలో విరాట్ అద్భుత ప్రదర్శనే కనిపించిందని తెలిపారు కపిల్. ఇందుకు విరాట్ కోహ్లీకి అభినందనలు తెలియజేసిన ఆయన.. ముంబై అతని ఆట కోసం ఎదురుచూస్తోందని చెప్పారు.