టీమిండియాలో సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాళ్లు ఎవరు? అంటే చటుక్కున గుర్తొచ్చే పేర్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ. వీళ్లిద్దరూ టీ20 వరల్డ్ కప్లో ఎంత అద్భుతంగా రాణించారో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సెమీఫైనల్లో ఘోరంగా ఓడిన టీమిండియా ఇంటి దారి పట్టింది. ఈ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ ఇంటికి వచ్చేయగా.. సూర్యకుమార్ మాత్రం న్యూజిల్యాండ్ సిరీస్ కోసం వెళ్లాడు. టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించాడు.
కివీస్తో మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా వెంటనే బంగ్లాదేశ్ వెళ్తుంది. అక్కడ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. టీ20ల్లో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. అదే జోరును మిగతా ఫార్మాట్లలో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలోనే మళ్లీ జిమ్లో అడుగు పెట్టాడు. జిమ్లో చెమటోడుస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పంచుకున్నాడు. దీనిలో ముందుగా ట్రెడ్మిల్పై రన్నింగ్ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత బ్యాక్ మజిల్స్కు ఎక్సర్సైజులు చేశాడు.
వరల్డ్ కప్ తర్వాత కొంత విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. భార్యతో కలిసి ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలు ఆశ్రమాలను సందర్శించి తిరిగి ఇంటికి చేరుకున్నాడీ స్టార్ బ్యాటర్. ఇప్పుడు తను జిమ్లో ఎలా కష్టపడుతుందీ ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఈ వీడియోపై సూర్యకుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ ఎంత వేగంగా పరిగెడతాడో అర్థమయ్యేలా చిరుతపులి బొమ్మను పోస్ట్ చేశాడు. అది చూసిన కోహ్లీ.. ప్రస్తుతం సూర్య ఉన్న ఫామ్ను సూచిస్తూ సింహం ఫొటోను పోస్టు చేశాడు.
సూర్య, కోహ్లీ ఇద్దరూ మైదానంలో చాలా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇద్దరూ కలిసి టీమిండియాకు మరపురాని విజయాలు అందించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ సోషల్ మీడియాలో మంచి స్నేహితులైపోయారు. ఒకరి పోస్టులపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. వీళ్లిద్దరూ ఇదే ఫామ్లో ఉంటే టీమిండియా భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.