కాన్బెర్రా: ఇటీవలే దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబి డివిలియర్స్ వేగవంతమైన 7వేల పరుగల రికార్డును బ్రేక్ చేసిన భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. తాజాగా శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర సెంచరీల రికార్డును సమం చేశాడు.
ఆస్ట్రేలియాలోని మానేకా ఓవల్ మైదానంలో బుధవారం జరుగుతున్న నాలుగో వన్డేలో విరాట్ కోహ్లీ తన 25 సెంచరీని పూర్తి చేశాడు. 84 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. కాగా, అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
27ఏళ్ల ఈ ఆటగాడు వేగవంతంగా 25 సెంచరీలను నమోదు చేశాడు. కేవలం 162 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. కాగా, 49 సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్ శతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో 30 సెంచరీలతో రికీ పాంటింగ్, 28 సెంచరీలతో సనత్ జయసూర్య ఉన్నారు.

జనవరి 17న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో తన 24వ వేగవంతమైన సెంచరీ చేసిన కోహ్లీ.. అదే మ్యాచులో వేగవంతంగా 7వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వన్డే అంతర్జాతీయ సెంచరీలు-టాప్ 5
49 -సచిన్ టెండూల్కర్(భారత్, 463 మ్యాచులు)
30 -రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా, 375)
28 -సనత్ జయసూర్య(శ్రీలంక, 445)
25 -కుమార సంగక్కర(శ్రీలంక, 404), (విరాట్ కోహ్లీ 170)
23 -ఏబి డివిలియర్స్(దక్షిణాఫ్రికా, 195)