
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత మాజీ మహిళా క్రికెటర్ తల్లి కరోనా ట్రీట్మెంట్ కోసం తన వంతు సాయం అందిచాడు. టీమిండియా మాజీ మహిళ క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడు చికిత్స కోసం రూ.6.77 లక్షలను విరాట్ విరాళంగా ఇచ్చాడు. తనకు సాయం చేసినందుకు ఆ మహిళా క్రికెటర్, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తతం కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
స్రవంతి నాయుడు తల్లి ఎస్కే సుమన్ ఇటీవలే కరోనా బారీన పడ్డారు. ఆమె పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. అప్పటికే తల్లి చికిత్స కోసం రూ.16 లక్షల వరకు స్రవంతి ఖర్చు చేశారు. అయినప్పటికీ తల్లి ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆమె బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని సాయం కోరారు. మరోవైపు బీసీసీఐ సౌత్ జోన్ మాజీ కన్వీనర్, స్రవంతి సోదరి ఎన్ విద్య యాదవ్.. విరాట్ కోహ్లీ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ సాయం కోరారు.
విషయం తెలుసుకున్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్.. విరాట్ కోహ్లీకి మెసేజ్ ఇచ్చాడు. వెంటనే స్పందించిన కోహ్లీ.. స్రవంతి నాయుడు తల్లి చికిత్స కోసం రూ.6.77 లక్షలను అందించాడు. ఇక హెచ్సీఏ కూడా స్రవంతి అభ్యర్థన మేరకు ఆమె తల్లి చికిత్సకు రూ. 5 లక్షలు సాయం ప్రకటించింది. స్రవంతి తన ఇన్స్టాలో షేర్ చేసిన స్టోరీతో చాలా మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. 'నిజాయతీగా చెబుతున్నా. కోహ్లీ వెంటనే స్పందించడం అద్భుతంగా అనిపించింది. గొప్ప క్రికెటర్ నుంచి ఎంతో గొప్ప ఔదార్యం. భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్కూ ధన్యవాదాలు' అని విద్య తెలిపారు.
స్రవంతి నాయుడు టీమిండియా తరఫున 1 టెస్టు, 4 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు ఆడారు. మహిళల టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/9) ఆమె పేరుతోనే ఉన్నాయి. కరోనాపై పోరులో విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ 'కెట్టో' ద్వారా కనీసం రూ. 7 కోట్ల విరాళాన్ని ఇతరుల నుంచి సేకరించాలని వీరిద్దరు నిర్ణయించారు. విరుష్క విరాళాల సేకరణ మొత్తం రూ. 11 కోట్లకు చేరువగా వచ్చింది. వసూలైన మొత్తాన్ని విరుష్క 'ఏసీటీ గ్రాంట్స్' అనే సంస్థకు అందిస్తారు.