టెస్టుల్లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అధిగమించలేడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అన్నాడు. గత కొన్నేళ్లుగా కోహ్లి తన లయ కోల్పోయాడని, సచిన్ రికార్డులను అందుకోలేడని పేర్కొన్నాడు. సచిన్ 200 టెస్టుల్లో 53.79 సగటుతో 15921 పరుగులు చేశాడు. 51 శతకాలు సాధించాడు.
విరాట్ కోహ్లి 114 టెస్టుల్లో 48.74 సగటుతో 8871 పరుగులు చేశాడు. 29 సెంచరీలు సాధించాడు. అయితే గత కొన్నాళ్లుగా కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్లో శతకాల మోత మోగించలేకపోతున్నాడు. 2020 నుంచి కేవలం రెండు సెంచరీలే నమోదుచేశాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులోనూ 6, 17 పరుగులతో నిరాశపరిచాడు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు భారత్ ఆడే పది టెస్టుల్లో కోహ్లి పుంజుకుంటే తిరిగి రికార్డుల రేసులోకి వస్తాడని, లేకపోతే సచిన్ రికార్డుల దరికి కూడా చేరుకోలేడని హాగ్ అన్నాడు.

అయితే సచిన్ రికార్డును ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ అధిగమించే ఛాన్స్ ఉందని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. గత కొన్నాళ్లుగా జో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. 146 టెస్టుల్లో 50.62 సగటుతో 12402 పరుగులు చేశాడు. 34 సెంచరీలు సాధించాడు. ''సచిన్ రికార్డులను విరాట్ కోహ్లి అందుకుంటాడని నేను భావించట్లేదు. అతను తన లయను కోల్పోయాడు. గత కొన్నేళ్లుగా జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రాబోయే పది టెస్టుల సీజన్లో అతను పుంజుకోవాలి, లేదంటే ఇక రికార్డు రేసులో లేనట్లే''
''అయితే జో రూట్ సాధిస్తాడని భావిస్తున్నా. రూట్ 146 మ్యాచ్ల్లో సుమారు 12వేల పరుగులు సాధించాడు. సచిన్ 200 టెస్టుల్లో దాదాపు 16వేల పరుగులు చేశాడు. అంటే 64 టెస్టుల్లో 4వేల పరుగులు అంతరాయంగా ఉంది. సచిన్ రికార్డులను రూట్ అధిగమిస్తాడని భావిస్తున్నా. సచిన్ ఘనతను అధిగమించాలని జో రూట్ ప్రయత్నిస్తాడు'' అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం న్యూజిలాండ్తో మూడు టెస్టులు, ఆస్ట్రేలియాతో అయిదు టెస్టులు భారత్ ఆడనుంది.
కాగా, 35 ఏళ్ల విరాట్ కోహ్లి భారత్ తరఫున 114 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 48.74 సగటుతో 8871 పరుగులు చేశాడు. 29 శతకాలు బాదాడు. ఇక వన్డే ఫార్మాట్లో 58.18 సగటుతో 13906 పరుగులు సాధించాడు. 50 వన్డే సెంచరీలు నమోదుచేశాడు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 ఫార్మాట్లో కోహ్లి 48.7 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఓ సెంచరీ బాదాడు.