
ఐపీఎల్ అందం అదే:
స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఐసీసీ టోర్నమెంట్లు ఆడేటప్పుడు ప్రత్యర్థి జట్టుతో మాత్రమే తలపడుతాం. టోర్నమెంట్ల్లో ప్రతిసారీ మనం ఇదే చూస్తాం. మ్యాచ్ సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో మనం పెద్దగా మాట్లాడలేం. ఇక ఆ జట్టుతో ఆడే అవకాశం అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. కానీ.. ఐపీఎల్ అలా కాదు. వివిధ దేశాల ఆటగాళ్లతో ఆడొచ్చు. ప్రతి రెండు, మూడు రోజులకు తప్పకుండా మ్యాచ్ ఉంటుంది. ఐపీఎల్ అందం అదే. అదొక భిన్న వాతావరణం. అలా ఆడటం నాకు ఎంతో ఇష్టం' అని అన్నాడు.

ఐపీఎల్ అంటే ఆసక్తి:
'ఐపీఎల్లో మనం ఎన్నో విషయాలను ఇతర కొత్త ఆటగాళ్లలో పంచుకోవచ్చు. కేవలం మన దేశ ఆటగాళ్లే కాదు, ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు మనకు గుర్తిండిపోతారు. అందుకే నాకు ఐపీఎల్ అంటే ఆసక్తి. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో నేను ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న భావన కలుగుతుంది' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'నా ఫేవరెట్ మ్యాచ్ అదే అని చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే అలాంటివి నాకెన్నో ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితి, ప్రాధాన్యతను బట్టి చూస్తే.. 2016 టీ20 ప్రపంచకప్లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన పోరు నా ఫేవరెట్ మ్యాచ్ల్లో ఒకటి. ఓడిపోయేస్థితిలో ఉన్నా.. మ్యాచ్లో మేము గెలిచాం' అని భారత కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

ఎప్పుడు ప్రారంభమైనా సిద్ధం:
కరోనా కారణంగా నిలిచిపోయిన క్రికెట్ పోటీలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమైనా తాను సిద్ధంగానే ఉంటానని విరాట్ కోహ్లీ అన్నాడు. 'అదృష్టవశాత్తు ఇంట్లో జిమ్ పరికరాలు ఉన్నాయి. కసరత్తులు చేస్తున్నా. అందుకే ఫిట్నెస్కు వచ్చిన సమస్య లేదు. నెట్స్లో గంటల కొద్దీ ప్రాక్టీస్ కన్నా.. మన మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికే ఇష్టపడతా. మానసిక స్థితి బాగుంటే సానుకూలంగా ఆలోచించగలం. ఆట మళ్లీ ఎప్పుడు ప్రారంభమైనా నేను ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉంటా. ఎక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలుపెట్టేందుకు ఇబ్బందేం లేదు' అని కోహ్లీ తెలిపాడు.

లీగ్ నిర్వాహణపై భిన్నాభిప్రాయాలు:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ధాటికి క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. విశ్వవ్యాప్తంగా ఏ టోర్నీ, ఏ సిరీస్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. వేసవి కాలంలో క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే ఐపీఎల్ కూడా కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడింది. అయితే ఈ లీగ్ నిర్వాహణపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ను ఖాళీ స్టేడియంలలో అయినా నిర్వహించాలనే వాదనలు ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ నిర్వహించడానికి తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఇప్పటికే బీసీసీఐకి ఆఫర్ చేసింది. తాజాగా యూఏఈకి ఇదే ఆఫర్ను బీసీసీఐ ముందు ఉంచింది.


Click it and Unblock the Notifications
