టెస్టుల్లో నెం.1 ర్యాంక్ని అందుకున్న కోహ్లి:
ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 149, 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి ఇటీవల టెస్టుల్లో నెం.1 ర్యాంక్ని అందుకున్న విషయం తెలిసిందే. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (2011) తర్వాత టెస్టుల్లో నెం.1 ర్యాంక్ని అధిరోహించిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లీ ఆట గురించి స్టీవ్వా మీడియాతో మాట్లాడాడు.
సవాళ్లతో కూడిన సిరీస్ను ఇష్టపడే.. కోహ్లీ:
‘ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ ఎక్కువగా పరుగుల దాహంతో కనిపించేవాడు. కానీ.. బాల్ టాంపరింగ్ కారణంగా అతనిపై నిషేధం వేటు పడటంతో 12 నెలలు ఆటకి దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో.. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కోహ్లీ సవాళ్లతో కూడిన సిరీస్ను ఇష్టపడతాడు. అతనే కాదు.. బ్రియాన్ లారా, టెండూల్కర్, వీవ్ రిచర్డ్స్, జావెద్ మియాందాద్ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా అలాంటి సిరీస్ల కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే.. తమలోని అత్యుత్తమ ఆటని వెలికితీసేది అవే కాబట్టి.'
ఎక్కడైనా పరుగులు రాబట్టగల విరాట్ కోహ్లి:
'విరాట్ కోహ్లి ఇప్పుడు ఎక్కడైనా పరుగులు రాబట్టగలడు. అతను బెస్ట్ బ్యాటింగ్ టెక్నిక్ని చేజిక్కించుకున్నాడు. గతంలో ఏబీ డివిలియర్స్కి కూడా మంచి టెక్నిక్ ఉండేది. కానీ.. ఇప్పుడు అతను టెస్టులు ఆడటం లేదు. ఇది కూడా కోహ్లీకి ఇక్కడ కలిసొచ్చింది' అని స్టీవ్వా వెల్లడించాడు.
స్టీవ్ స్మిత్ .. మళ్లీ అతనే నంబర్ వన్ అయిపోతాడంటూ..:
స్టీవ్ స్మిత్ నిషేదం పూర్తయిన తర్వాత మైదానంలో అడుగుపెడితే మళ్లీ అతనే నంబర్ వన్ అయిపోతాడంటూ ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్ మిచెల్ స్టార్క్ అంటున్నాడు. స్మిత్ నాకు కొన్ని నెలలుగా తెలుసు. అతని ఆటతీరుపై నాకు నమ్మకముంది. అనుకోని పరిస్థితుల వల్ల స్మిత్పై నిషేదం పడింది. అతను దక్షిణాఫ్రికా సిరీస్లో తానొక్కడై జట్టను నడిపించిన తీరు అద్భుతం. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నంబర్ వన్ స్థానం అనుకుంటే వెంటనే వచ్చేయదు. చాలా సమయమే పట్టొచ్చు. కానీ, స్మిత్ తప్పకుండా మళ్లీ నంబర్ వన్ అయి తీరుతాడు.' అని తెలిపాడు.