న్యూఢిల్లీ: టీమిండియాలో స్టార్ బ్యాట్స్మన్గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ.. తనకు అది చాలదంటున్నాడు. ప్రపంచంలోనే గొప్ప క్రీడాకారుడిగా ఉండాలని కోరుకుంటున్నాడట. ఈ విషయాన్ని టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సిబి) ఫిట్నెస్ కోచ్ శంకర్ బసు వెల్లడించారు.
అందుకే కోహ్లీ తన ఫిట్నెస్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడని కోచ్ చెప్పారు. ఇటీవల కాలంలో సిక్సులు, బౌండరీలు స్వేచ్ఛగా కొడుతున్నాడంటే అది అతని ఫిట్నెస్ రహస్యమేనని అంటున్నారు.

'విరాట్ ప్రపంచంలోనే గొప్ప, ఉత్తమ క్రీడాకారుడు కావాలని కోరుకుంటున్నాడు. అతనికి ఆకాశమే హద్దు. అతనికెంతోమంది మార్గదర్శకులున్నారు. అతను ఎప్పుడూ పోటీ నుంచి పారిపోడు. అతని తన రెండు చేతులా రాణిస్తాడు' అని బిసిసిఐ.టీవీతో మాట్లాడుతూ బసు చెప్పారు.
కోహ్లీ పూర్తి ఫిట్నెస్ ఉన్న ఆటగాడని చెప్పాడు.
'చాలా మంది క్రీడాకారులు తమకు ఇలాంటి కోచ్ దొరకడం తమ అదృష్టమని చెప్పుకుంటారు. కానీ, నేను మాత్రం కోహ్లీ లాంటి క్రీడాకారుడికి కోచ్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఐపిఎల్ మొదటి నుంచి దాదాపు 8ఏళ్లపాటు అతనికి కోచ్ వ్యవహరిస్తున్నా' అని బసు తెలిపారు.
కోహ్లీ ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ చాలా బాగుంటాయని బసు చెప్పారు. అంతేగాక, అతనికి మంచి అనిపిస్తే ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చెప్పడని తెలిపారు. ఫిట్నెస్ కోసం అతను ఎంతో శ్రమిస్తాడని తెలిపారు. తాను ఇచ్చిన సలహాలను ఎంతో శ్రద్ధగా పాటిస్తాడని చెప్పారు.
బలహీనంగా ఉంటే సిక్సులు కొట్టలేమని కోహ్లీ ఒకసారి తనతో చెప్పాడని బసు తెలిపారు. ఐపిఎల్ టోర్నీలో సిక్సులు, బౌండరీలు ఎంతో అవసరముండటంతో తన ఫిట్నెస్ పై మరింత దృష్టిసారించాడని చెప్పారు. తనను తాను దృఢంగా మార్చేసుకున్నాడని తెలిపారు. కాగా, ఐపిఎల్-9లో 38 సిక్సులు బాదాడు కోహ్లీ. ఇది గత ఐపిఎల్ టోర్నీలో కంటే 15 సిక్సులు అదనంగా చేరడం గమనార్హం.