ఢాకా: ఏ జట్టుతో ఆడినా తన ఆటతీరులో మార్పు ఉండదని టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్, టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. పాకిస్థాన్ ఆడినప్పుడు కూడా సహజమైన శైలిలోనే ఆడతానని, ఇతర జట్లతో ఆడినట్లుగానే భావిస్తానని చెప్పాడు.
ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా బుధవారం జరిగే మ్యాచులో బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మంగళవారం ఢాకాలో మీడియాతో మాట్లాడాడు. అన్ని జట్లను ఒకేలా చూస్తామని, ప్రతి జట్టుపైనా బాగా ఆడాలని కోరుకుంటామని చెప్పాడు.

ఆటగాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంచడం చాలా కీలకమని పేర్కొన్నాడు. మైదానంలోకి దిగాక ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించేందుకు బాగా ఆడాలని అనుకుంటామని, పాకిస్థాన్ టీంతో ఆడినప్పుడు కూడా అదేవిధమైన పట్టుదల ప్రదర్శిస్తామని తెలిపాడు. పాకిస్థాన్ బలమైన జట్టు అని పేర్కొన్నాడు.
పాకిస్థాన్ జట్టులోకి ఐదేళ్ల నిషేధం తర్వాత మొహమ్మద్ అమీర్ పునరాగమనం చేయడం పట్ల విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. అమీర్ ప్రపంచ స్థాయి బౌలర్ అని కోహ్లీ కొనియాడాడు.
కాగా, 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో అమీర్పై ఐదేళ్ల నిషేధం విధించడం జరిగింది. నిషేధం పూర్తి కావడంతో అతడ్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. కాగా, ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 27న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.