
టీమిండియాకు షాకింగ్ న్యూస్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే తొలి వన్డేకు విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ తప్పుకోవడానికి ఓ కారణముంది. సోమవారం కోహ్లీ ప్రాక్టీస్ చేయడానికి రాలేదు. నాటింగ్హమ్ నుంచి లండన్కు బస్సులో టీం మేట్లు రాగా కోహ్లీ ఒక్కడే రాలేదు. దీంతో రేపు (మంగళవారం) ఓవల్లో ఇంగ్లాండ్తో జరిగే మొదటి వన్డేకు దాదాపుగా అతను ఆడడం కుదరని పని అని అర్థమవుతుంది. అయితే జూలైన 14న లార్డ్స్ స్టేడియంలో, జులై 17న మాంచెస్టర్లో జరగబోయే తదుపరి రెండు వన్డే మ్యాచ్లకు మళ్లీ జట్టుకు అందుబాటులోకి రావొచ్చు.
అసలింతకు కోహ్లీకి ఏమైందంటే.. మూడో టీ20 సందర్భంగా విరాట్కు గజ్జల్లో గాయమైంది. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడా.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడే ఈ గాయమైందని స్పష్టమవుతుంది. ఎందుకంటే కోహ్లీ పెద్ద ఇన్నింగ్సేం ఆడలేదు. ఫీల్డింగ్ టైంలో ఓ ఫోర్ ఆపే క్రమంలో డైవ్ చేశాడు. కానీ బంతి ఆగలేదు.. అది నేరుగా బౌండరీకి వెళ్లింది. ఆ టైంలోనే గాయపడ్డట్టు జట్టు ఫిజియోలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'గజ్జలో నొప్పి కారణంగా అతనికి విశ్రాంతి తప్పకుండా అవసరం. అందువల్ల కోహ్లీ రేపు ఓవల్లో జరిగే మొదటి వన్డేకు బహుశా దూరం కానున్నాడు' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పీటీఐతో తెలిపాడు. ఇకపోతే రేపు ఇండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.
కోహ్లీ ఫామ్ లేమితో బాధపడుతుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల అతనికి మద్దతుగా మాట్లాడాడు. కొన్ని మ్యాచ్లను పరిగణనలోకి తీసుకుని స్టార్ ప్లేయర్ ఆటను అంచనా వేయొద్దంటూ విమర్శకులకు బదులిచ్చాడు. అయితే కోహ్లీ ఫామ్ లేమిని, జట్టులో అతనికి అవకాశాలు కల్పించడాన్ని కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ప్రముఖులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తొలి వన్డేకు కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యార్ తుది జట్టులో బరిలోకి దిగబోతున్నాడు. అయితే ఇటీవల ఇండియా టీంలో ప్రయోగాలు జరుగుతున్నందున శ్రేయస్కు బదులు ఇషాన్ కిషన్ను కూడా తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది.