హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో రెండో రోజైన శుక్రవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 111 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విరాట్ కోహ్లీ 240 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో కోహ్లీ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.
కోహ్లీ డబుల్ సెంచరీ అనంతరం అభిమానులకు అభివాదం చేస్తుండగా, స్టేడియం గ్యాలరీలో కూర్చున్న ఓ మహిళా అభిమానికి ప్లయింగ్ కిస్లు పెట్టింది. ఆ మహిళా అభిమాని కోహ్లీకి ప్లయింగ్ కిస్లు ఇస్తున్న సమయంలో కెమెరా క్లిక్ మనిపించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

కాగా, బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో కోహ్లీ వరుసగా నాలుగో డబుల్ సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
అంతక ముందు కోహ్లీ ఆడిన వెస్టిండిస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరిస్లలో వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రవిడ్ల రికార్డుని విరాట్ కోహ్లీ చెరిపేశాడు.
డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రవిడ్లు మాత్రమే వరుసగా మూడు సిరిస్లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు.

2011లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీకి బంగ్లా టెస్టు 54వది కావడం విశేషం. టెస్టుల్లో కోహ్లీ ఇప్పటివరకు 16 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. కాగా, బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లి 204 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరాడు.