ధోనీకి చేరువలో కోహ్లీ:
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇప్పటివరకు 8 సార్లు ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. గతంలో మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మొహమ్మద్ అజహరుద్దీన్ టీమిండియాను చెరో 7 సార్లు ఇన్నింగ్స్ తేడాతో గెలిపించారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఇన్నింగ్స్ పరుగుల తేడాతో విజయాలను అందుకుంది. కోహ్లీ మరోసారి టీమిండియాను ఇన్నింగ్స్ పరుగుల తేడాతో గెలిపిస్తే.. ధోనీ రికార్డును సమం చేస్తాడు.
30వ టెస్టు విజయం:
విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్కు ఇది 30వ టెస్టు విజయం. కెప్టెన్ గా తొలి 50 టెస్టుల తర్వాత సాధించిన అత్యధిక విజయాలు చూస్తే.. కోహ్లీది మూడో స్థానం. ఆసీస్ మాజీ కెప్టెన్లు స్టీవ్ వా 37 టెస్టులు గెలుచుకోగా.. రికీ పాంటింగ్ 35 టెస్టుల్లో విజయం అందించాడు. కోహ్లీ సారథ్యంలోని 50 టెస్టుల్లో భారత్ 10 టెస్టులు ఓడి మరో 10 డ్రా చేసుకుంది.
వరుసగా 11 టెస్టు సిరీస్ విజయాలు
ఈ విజయంతో భారత్ స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్లను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. గతంలో ఆస్ట్రేలియా రెండు సార్లు (1994-2001, 2004-2008 మధ్య కాలంలో) వరుసగా 10 సిరీస్లు గెలిచింది. 2013 ఫిబ్రవరిలో ఆస్టేలియాపై 4-0తో సిరీస్ గెలవడంతో భారత్ విజయప్రస్థానం మొదలైంది. భారత్ సొంతగడ్డపై చివరిసారిగా 2012లో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడింది.
భారత్కిదే భారీ విజయం:
దక్షిణాప్రికాపై భారత్కిదే భారీ విజయం. గతంలో ధోనీ సారథ్యంలోని జట్టు (2009-10) కోల్కతా టెస్టులో ఇన్నింగ్స్ 57 పరుగులతో సఫారీలపైవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 137 పరుగులతో సఫారీ జట్టును భారత్ చిత్తుచేసింది. ఈ దశాబ్దంలో దక్షిణాఫ్రికా రెండు సార్లు ఇన్నింగ్స్ పరాభవాలు చవిచూసింది. ఆ రెండు భారత్ చేతిలోనే కావడం మరో విశేషం.