రాజస్థాన్ రాయల్స్పై అద్భుతమైన విజయం సాధించిన ఆర్సీబీ జట్టుకు ఆ టీం స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పెద్ద పార్టీ ఇచ్చాడు. ముంబైకి ఈ జట్టు మొత్తం వచ్చినప్పుడు వాళ్లను తన సొంత రెస్ట్రో-బార్కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకుంది.
ఈ వీడియోలో కోహ్లీ, అనుష్క జంట ఆర్సీబీ ప్లేయర్లు అందర్నీ రెస్ట్రో-బార్కు ఆహ్వానిస్తూ కనిపించారు. జట్టు ప్లేయర్లతోపాటు సహాయక సిబ్బంది కూడా ఈ పార్టీలో తెగ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్పై ఆర్సీబీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.

జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో అనూజ్ రావత్ కూడా ధాటిగా ఆడాడు. దీంతో ఆ జట్టు ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు.
ఆర్సీబీ బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభావం చూపలేదు. దీంతో రాజస్థాన్ కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయి, ఘోరంగా ఓడింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా మిగిలాయి.
మిగతా రెండు మ్యాచుల్లో కూడా ఆర్సీబీ మంచి విజయాలు సాధిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కోహ్లీ తన టీం, సహాయక సిబ్బంది అందరికీ తన రెస్ట్రో బార్లో అద్భుతమైన పార్టీ ఇచ్చాడు. సిరాజ్ సహా అందరూ ఈ బార్లో తెగ ఎంజాయ్ చేశారు.