రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరగా ఆడిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ పెద్ద ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా ఎగ్రెసివ్గా కనిపించాడు. ఈ క్రమంలోనే లక్నో ఆటగాళ్లు అతనిపై కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ టీం గ్లోబల్ మెంటార్ గౌతం గంభీర్ కూడా గొడవకు కాలు దువ్వాడు.
దీన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ ఈ ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ వేసింది. అసలు ఈ గొడవకు కారణమైన ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్కు 50 శాతం మ్యాచ్ ఫీజును ఫైన్ వేసింది. ఈ క్రమంలో ఈ గొడవకు సంబంధించిన వివరణ ఇస్తూ బీసీసీఐలోని పలువురికి విరాట్ కోహ్లీ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తనది ఏమాత్రం తప్పులేదని కోహ్లీ ఈ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

తను ఎవరినీ కించ పరిచేలా వ్యాఖ్యలు చేయలేదని, తనపై ఇంత భారీ ఫైన్ వేయడం ఏమాత్రం సమంజసం కాదని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ గొడవలో కోహ్లీ, గంభీర్ ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని లెవెల్ 2 నిబంధనలు ఉల్లంఘించినట్లు బీసీసీఐ భావించింది. ఈ ఫైన్ను కోహ్లీ కట్టనక్కర్లేదని, తామే దీన్ని చెల్లిస్తామని ఆర్సీబీ యాజమాన్యం చెప్పినట్లు సమాచారం. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఈ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాలని ఆర్సీబీ నిర్ణయించింది.
ఈ క్రమంలోనే తనపై వేసిన ఫైన్ సమంజసం కాదని కోహ్లీ కంప్లయింట్ చేశాడు. మ్యాచ్ చివర్లో నవీన్ ఉల్ హక్కు సిరాజ్ బౌన్సర్లు వేశాడు. ఇది కోహ్లీనే చెప్పి వేయించాడని, నవీన్ను ఫిజికల్గా గాయపరిచేందుకే ఇలా చేశాడని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తను అలాంటి సూచనలు చేయలేదని, వికెట్ కోసం బౌన్సర్లు వేయాలని మాత్రమే చెప్పానని కూడా ఈ లేఖలో కోహ్లీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.