
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది అభిమానుల్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అతను సెంచరీ కూడా చేశాడు. అయితే ఈ క్రమంలో వికెట్ కీపర్ కేఎస్ భరత్తో కలిసి బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ చేసిన పని ఇప్పుడు వైరల్గా మారింది. జడేజా అవుటైన తర్వాత కేఎస్ భరత్ క్రీజులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ సింగిల్ కోసం పిలుపు ఇచ్చాడు. దీనికి భరత్ నిరాకరించడంతో పరుగు కోసం ముందుకొచ్చేసిన కోహ్లీ వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఘటన జరిగినప్పుడు కోహ్లీ స్కోరు 67 పరుగులు. నాలుగో రోజు ఆటలో 109వ ఓవర్లో కోహ్లీ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న భరత్.. బంతి నేరుగా ఫీల్డర్ వద్దకు వెళ్లడం చూశాడు. దీంతో సడెన్గా పరుగుకు నో చెప్పి నిరాకరించాడు. అప్పటికే పిచ్లో దాదాపు సగం ముందుకు వచ్చేసిన కోహ్లీ.. భరత్ రియాక్షన్ చూసి సడెన్గా వెనక్కు తిరగాల్సి వచ్చింది. సరైన సమయానికి అతను వెనక్కు వెళ్లకపోయి ఉంటే రనౌట్ అయిపోయేవాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది.
భరత్ వైపు సీరియస్ లుక్ ఇచ్చిన కోహ్లీ.. కోపంతో గట్టిగా అరిచేశాడు. ఆ తర్వాత కొంత సేపటికి శాంతించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. టెస్టుల్లో తన 28వ శతకం సాధించాడు. ఓవరాల్గా ఇది అతనికి 75వ అంతర్జాతీయ సెంచరీ. అలాగే భరత్ కూడా ఈ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. వేగంగా ఆడుతూ 44 పరుగులు చేశాడు. కానీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోకుండానే లియాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.