డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు బాట పట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది.
సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలు సాధించారు.అనంతరం ఛేదనలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది.
విల్ జాక్స్ (100*, 41 బంతుల్లో, 5x4, 10x6) అజేయ మెరుపు శతకం సాధించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లి (70*; 44 బంతుల్లో, 6x4, 3x6) విధ్వంసం సృష్టించాడు.

కాగా, మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడాడు. తన స్ట్రైక్రేట్పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను కోహ్లి పరోక్షంగా ఖండించాడు. బాక్స్లో కూర్చొని కామెంటరీ చేయడం సులువని, కానీ ఆ పరిస్థితుల్లో ఆడితే అసలు విషయం తెలుస్తుందని మండిపడ్డాడు. SRHతో జరిగిన గత మ్యాచ్లో కోహ్లి (51; 43 బంతుల్లో) స్లో ఇన్నింగ్స్ ఆడాడని, సింగిల్స్కే పరిమితమయ్యాడని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కోహ్లి నుంచి ఆర్సీబీ అలాంటి ఆటను కోరుకోదని విమర్శించాడు. దీనిపై తాజాగా కోహ్లి స్పందించాడు.
''చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్రేటు గురించి, స్పిన్లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. కానీ నా పరంగా జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యం.15 ఏళ్లుగా అదే పని చేస్తున్నా. నా దృష్టిలో.. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్లో కూర్చొని మాట్లాడటం సరికాదు. నా గురించి దీర్ఘకాలంగా విమర్శించే వాళ్లకు ఏం జరుగుతుందో తెలుసు. ఇది నాకు ఓ మజిల్ మెమోరీ లాంటిది'' అని కోహ్లి అన్నాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఫాస్ట్ బౌలింగ్లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 9 పరుగులు చేశాడు. స్పిన్లో 34 బంతుల్లో ఎదుర్కొన్న 61 పరుగులు సాధించాడు.