పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న 'డూ ఆర్ డై' మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7x4, 6x6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3x4, 6x6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5x4, 1x6) రాణించాడు.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు (3/38), అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప (2/36) రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లికి రెండు సార్లు లైఫ్ లభించింది. పరుగుల ఖాతా తెరవకముందు, 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు విరాట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూడలేదు.

సొగసైన బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లి సెంచరీని చేజార్చుకున్నాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అయితే శతకాన్ని సాధించినప్పటికీ ఈ రన్ మెషిన్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు ప్రత్యర్థి జట్లపై 1000+ పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు.
కోహ్లి పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్పై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. కాగా, ఈ అరుదైన జాబితాలో కోహ్లి తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (కేకేఆర్, ఢిల్లీ), డేవిడ్ వార్నర్ (కేకేఆర్, పంజాబ్) ఉన్నారు. వీరిద్దరు రెండు జట్లపై వెయ్యి పరుగులు బాదారు.
అంతేగాక కోహ్లి మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 600+ పరుగులు సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ సరసన కోహ్లి నిలిచాడు. విరాట్, రాహుల్ నాలుగు సీజన్లలో 600కు పైగా పరుగులు సాధించాడు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ చెరో మూడు సార్లు, డుప్లెసిస్ రెండు సార్లు ఈ ఘనత అందుకున్నారు.