
2008 తర్వాత తొలిసారి
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 2020ని ఒక్క సెంచరీ లేకుండా పూర్తి చేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో నాలుగు పరుగులే చేసిన విరాట్.. ఈ ఏడాదిని అలా ముగించాడు. దీంతో 2008 తర్వాత తొలిసారి సెంచరీ లేకుండా నిలిచాడు. కోహ్లీ అరంగేట్రం చేసిన ఏడాది మినహాయిస్తే.. ఏటా శతకాలతో మైమరపించాడు. ఈ ఏడాది కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా సుమారు 9 నెలలు అంతర్జాతీయ ఆటకు దూరమవడంతో 2020ని ఇలా ముగించాడు. 2020లో విరాట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు (అన్ని ఫార్మాట్లు పరంగా) 89.

89 పరుగులే అత్యధికం
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 74 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. నవంబర్లో ఆస్ట్రేలియాతో ఆడిన రెండో వన్డేలో అతడు చేసిన 89 పరుగులే ఈ ఏడాది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2020లో మొత్తం 3 టెస్టులు, 9 వన్డేలు, 10 టీ20లు విరాట్ ఆడాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్లో 116, 50 ఓవర్ల ఫార్మాట్లో 431, టీ20 క్రికెట్లో 295 పరుగులు చేశాడు. ఇక మొత్తం మీద 86 టెస్టుల్లో 27 శతకాలు, 251 వన్డేల్లో 43 శతకాలు బాదాడు.

కోహ్లీ లేకుండానే
ఇక కోహ్లీ ఈ ఏడాది మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఈ టెస్టు తర్వాత అతడు స్వదేశానికి పయనం కావడంతో మళ్లీ వచ్చే ఏడాదే బరిలోకి దిగే అవకాశం మాత్రమే ఉంది. వచ్చే నెలలో కోహ్లీ భార్య అనుష్క శర్మ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో అతను భారత్కు పయనం కానున్నాడు. ఇప్పటికే బీసీసీఐ అతనికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. దీంతో కోహ్లీ లేకుండానే భారత్ మిగతా టెస్టులను ఆసీస్తో ఆడనుంది. అజింక్య రహానే జట్టు బాధ్యతలు మోయనున్నాడు.

వరుసగా ఐదు వన్డేలు
మరొకవైపు 2020 విరాట్ కోహ్లీకి ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. కెప్టెన్గా ఐదు వన్డేలను కోల్పోయిన అపప్రథను కోహ్లీ మూటగట్టుకున్నాడు. ఆసీస్తో వన్డే సిరీస్కు ముందు మూడు వన్డేలను కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా కోల్పోగా, ఆస్ట్రేలియాపై వరుసగా రెండు వన్డేలను చేజార్చుకుంది. ఫలితంగా 21 ఏళ్ల తర్వాత వరుసగా ఐదు వన్డేలను చేజార్చుకున్న టీమిండియా కెప్టెన్గా నిలిచాడు. 1981లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని టీమిండియా ఇలానే వరుసగా ఐదు వన్డేలను చేజార్చుకుంది. ఆ తర్వాత కోహ్లీనే ఇలా ఐదు వన్డేలను కోల్పోయిన టీమిండియా తొలి కెప్టెన్ కావడం గమనార్హం.

అత్యల్ప స్కోర్
టీమిండియా చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన రోజు (డిసెంబర్ 19). టెస్టు క్రికెట్లో భారత జట్టు అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది ఇవాళే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇది ఊహించలేనిది. దూకుడు ఆటతో అందర్నీ హడలెత్తించే కోహ్లీసేన ఇలా కుప్పకూలడం బాధాకరం. గెలవాల్సిన మ్యాచ్లో అనూహ్య రీతిలో పరాభవాన్ని మూటకట్టుకుంటున్నది. టెస్టు చరిత్రలో ఇదో పీడకల కానుంది. అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో భారత్ కేవలం 36 పరుగులకే తన రెండవ ఇన్సింగ్లో ఆలౌటైంది. టెస్టు క్రికెట్లో భారత్ అత్యల్ప స్కోర్క్కు నిష్క్రమించడం ఇదే తొలిసారి. చివరిసారి 1974లో టీమిండియా జట్టు 42 పరుగులు చేసింది. కానీ ఆ అత్యల్ప రికార్డును కోహ్లీసేన చెరిపేసింది.
టీమిండియా ఘోర వైఫల్యం: కోహ్లీసేనపై పేలుతున్న మొబైల్ నెంబర్, ఓటీపీ జోక్లు.. సెహ్వాగ్ సెటైర్!!


Click it and Unblock the Notifications












